సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 20: నేటి విద్యార్థులే.. రేపటి నవ సమాజ నిర్మాతలని గ్రహించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ప్రక్రియను ప్రారంభించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించారు.
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారు ఏకాగ్రతగా చదువుకోవాలనే ఉద్దేశంతో అల్పాహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనంతో పాటు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయమని తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని వచ్చే అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.
జిల్లాలో 1,06,000 మంది విద్యార్థులకు లబ్ధి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,013 ప్రభుత్వ పాఠశాలల్లో 1,06,000 మంది విద్యార్థులకు అల్పాహార పథకం అందనున్నది. ఈ మేరకు జిల్లాలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు 7,340 మంది ఉండగా.. రెండో తరగతిలో 10,302 మంది, మూడో తరగతిలో 8,620, నాలుగో తరగతిలో 9,643 ఐదో తరగతిలో.. 9,079, ఆరో తరగతిలో.. 8,398, ఏడో తరగతిలో.. 10,070, ఎనిమిదో తరగతిలో.. 9,152 మంది, తొమ్మిదో తరగతిలో 9,254 మంది, పదో తరగతిలో 9,196 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ రోజూ ఉదయం అల్పాహారం అందించనున్నారు.
అల్పాహారంలో కిచిడీ, ఉప్మా, పొంగల్
ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించే కార్యక్రమం అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. అయితే అల్పాహారం మెనూలో ఏయే పదార్థాలు ఉంచాలన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రవ్వ, ఉప్మా, పొంగల్, కేసరి, కిచిడీ వంటి పదార్థాలను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న రాగిజావ, ఉడికించిన కోడిగుడ్లు ఎప్పటిలాగే అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇప్పటికే పోషకాలతో కూడిన ఆహారం అందిస్తుండగా.. ఇపుడు అందించే అల్పాహారంతో విద్యార్థులు మరింత శారీరకంగా, మానసికంగా ఎదిగే అవకాశం ఉంటుంది.