పటాన్చెరు, అక్టోబర్ 2: బ్రాహ్మణులకు తెలంగాణలో అధిక ప్రాధాన్యత లభిస్తున్నదని తెలంగాణ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు. సోమవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ, చతుర్వేద సదస్సు, తెలంగాణ విద్వత్ పరీక్ష సభలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన విద్వత్ పరీక్షలు, వేదశాస్త్ర ప్రవర్ధక సభ ముగింపు సభలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు హోమాల్లో నవీన్ మిట్టల్ దంపతులు పాల్గొన్నారు. అధికారులు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దంపతులను బ్రాహ్మణ సంఘం సన్మానించింది. అనంతరం నవీన్ మిట్టల్ మాట్లాడుతూ బ్రాహ్మణులు మన సంస్కృతిని కాపాడుతున్నారన్నారు. ఇతర రాష్ర్టాల అధికారులు తెలంగాణ అభివృద్ధి గురించి, అన్ని కులాలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి కొనియాడుతారన్నారు. బ్రాహ్మణులకు తెలంగాణలో దక్కుతున్న గౌరవం ఇతర రాష్ర్టాల్లోను కావాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. వేదాలు పఠిస్తున్న వారిలో జ్ఞాపకశక్తి ఆమోఘంగా ఉంటున్నదన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్, బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
వేదపాఠశాల నిర్మిస్తాం
బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో వేద పాఠశాల నిర్మించేందుకు కృషి చేస్తా. హాస్టల్తో సహా ఆధునిక సౌకర్యాలతో ఈ పాఠశాల, వసతి గృహం నిర్మిస్తాం. సంబంధించి కేటాయింపు అంశంలో కలెక్టర్ సహకరించాలని కోరుతున్నాం. భూమి కేటాయించిన తర్వాత సొంత నిధులతో నిర్మాణపు పనులు ప్రారంభిస్తా. వేద పండితులను సీఎం కేసీఆర్ గొప్పగా గౌరవిస్తారు. బ్రాహ్మణుల ఆశీస్సులతోనే అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. తెలంగాణలో వారి సంక్షేమానికి అండగా ఉంటున్నారు. 60 ఏండ్లు పైబడిన అర్చకులకు రూ.5 వేల పెన్షన్ ఇస్తున్నారు. ధూపదీప నైవేద్యం పథకంలో దేవాలయాల నిర్వహణ ఖర్చులు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వేద పండితుల ఆశీస్సులతో మూడోసారి ఎన్నికల్లో గెలుస్తాననే ధీమా ఉంది.
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
సమాజ హితం కోసం కృషి
బ్రాహ్మణులు మన సంస్కృతిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమాజ హితం కోసం బ్రాహ్మణులు చేస్తున్న కృషి అనిర్వచనీయం. మన గోత్రనామాలు పలుకుతూ జనం సంక్షేమం కోసం పూజలు చేసే బ్రాహ్మణులపై ఎంతో గౌరవం ఉంది. నాకున్న పరిధిలో బ్రాహ్మణులకు అండగా ఉంటా.
– శరత్, కలెక్టర్, సంగారెడ్డి