గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, పోడు భూముల పట్టాల పంపిణీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని సాయిగార్డెన్లో మెదక్ , నర్సాపూర్ నియోజకవర్గాలకు చెందిన 610 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షిషాలతో కలసి ఆయన పోడు భూముల హక్కు పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నర్సాపూర్, శివ్వంపేట మండలాల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకున్నాయని ఎద్దేవా చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పించడం, విదేశీ విద్యకోసం రూ.20లక్షల స్కాలర్షిప్ అందించడం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందని గుర్తుచేశారు. తండాలను పంచాయతీలుగా గుర్తించామని, ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో రూ.56కోట్లతో సీసీ రోడ్లు వేశామన్నారు. జర్నలిస్టులను కడుపులోపెట్టుకుని చూసుకుంటున్నామని, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి అన్ని విధాలా అండగా నిలబడుతున్నామన్నారు.
నర్సాపూర్, జూలై 8: దేశవ్యాప్తంగా పోడుభూముల పట్టాల పంపిణీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణం సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లోని 517 ఎకరాలకు గాను 610 మంది గిరిజనులకు పోడుభూముల పట్టాలను మంత్రి ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షిషాతో కలిసి అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల ఎకరాలకు పోడుపట్టాలను అందిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో 10.71 శాతం పోడుపట్టాలిచ్చి తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు.
గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పోడుభూముల ద్వారా పట్టాలు ఇవ్వడమే కాకుండా పది రకాల లాభాలు గిరిజన బిడ్డలకు దక్కుతుందని తెలిపారు. అందులో యాజమాన్యం, రైతుబంధు, రైతు బీమా, వారసత్వం, ఉచిత విద్యుత్, సబ్సిడీలపై పనిముట్లు, పంటనష్టం, కేసుల కొట్టివేత, క్రాప్లోన్లు, సొసైటీల్లో అధికారాలు పోడు రైతులకు అందనున్నట్లు వివరించారు. కాంగ్రెస్, బీజేపీలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, పోడుభూములకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచన ఏ కొసన వారికి రాలేదని ఎద్దేవా చేశారు. గిరిజనుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని వెల్లడించారు. విద్య, ఉద్యోగంలో గిరిజనులకు పదిశాతం కల్పించడం, విదేశీ విద్యకోసం రూ.20లక్షల స్కాలర్షిప్ అందిస్తున్నారని గుర్తు చేశారు. 2009 మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ నాయకులు తండాలను గ్రామపంచాయతీలు చేస్తామని చెప్పి గిరిజనులను మోసం చేశారని, ఇచ్చిన మాట తప్పకుండా సీఎం కేసీఆర్ 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసి మా తండాలో మా రాజ్యం అనే నానుడిని నిజం చేశారన్నారు.
మెదక్ జిల్లాలో 63 గ్రామ పంచాయతీల్లో గిరిజనులే సర్పంచ్లుగా పదవుల్లో ఉన్నారన్నారు. సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో గిరిజన తండాలు వందకోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో రూ.56 కోట్లతో గిరిజన తండాల్లో సీసీరోడ్లు వేసినట్లు తెలిపారు. కేసీఆర్ కిసాన్ ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీలు పరేషాన్ అవుతున్నాయని, ముఖ్యమంత్రిని తిట్టడమే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు పెట్టుకున్నారని, ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో మోదీ తిట్టిపోతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ పథకాలను ప్రధాని మోదీ కాపీ కొడుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని, పెట్టుబడులను కల్పిస్తున్నానని మోదీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ రమేశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీవో శ్రీనివాసులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్గుప్తా, అశోక్గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, శివ్వంపేట జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్లు రాజుయాదవ్, వెంకట్రామ్రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, ఎఫ్ఆర్వో అంబర్సింగ్, తహసీల్దార్లు ఆంజనేయులు, శ్రీనివాస్చారీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బోగ చంద్రశేఖర్, రమణాగౌడ్, పట్టణ అధ్యక్షుడు పంబళ్ల భిక్షపతి, వివిధ మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గిరిజనులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు నడిపిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 610మందికి పోడుభూముల పట్టాలు అందుతున్నాయని, పోడు రైతులు రైతుబీమా, రైతుబంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు పేదలను విస్మరించాయని, బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మన సీఎం చేతల సీఎం అని వెల్లడించారు. గిరిజనులకు ఇక మీదట ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. మెదక్ జిల్లా తరుఫున సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పోడుభూముల్లో 75 ఏండ్లు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పోడు రైతుల కల నేటితో సాకారమైందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి, అర్హులను గుర్తించినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడుభూముల అర్హులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఈ పట్టాల పంపిణీతో గిరిజనుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు.
పోడుభూముల పట్టాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనుల కల సీఎం కేసీఆర్తో సాకారమైందని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో పోడుభూముల పట్టాలను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో పంపిణీ చేసినట్లు చెప్పారు. అటవీ అధికారులు చట్టబద్ధంగా చేసే పనులు గిరిజనులకు ఎంతో ఇబ్బందులను కలిగించాయని, నేటితో గిరిజనులకు విముక్తి లభించిందన్నారు. పట్టాలు రాని అర్హులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే రెండో విడుతలో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్కు గిరిజనులపై అమితమైన ప్రేమ ఉన్నదని, వారికోసం హైదరాబాద్లో బంజారా భవన్ను కట్టించారని గుర్తు చేశారు. తండాల్లో మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం, గ్రామపంచాయతీ భవనాలు, విద్యుత్, రోడ్ల నిర్మాణం తదితర పనులు చేసి అభివృద్ధి చేశామని, నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో సుమారు రూ.56కోట్లతో సీసీరోడ్లు వేశామన్నారు. రూ.78 కోట్లతో బీటీ రోడ్లు మంజూరు చేశామని, త్వరలోనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పోడుపట్టాలు పొందిన గిరిజనులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులకు రైతుబీమా కూడా వర్తిస్తుందని తెలిపారు. గిరిజనులంతా సీఎం కేసీఆర్ను మరోమారు ఆశీర్వదించాలని కోరారు.
చరిత్రలో నిలిచిపోయే పండుగ రోజు అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఇంతకుముందు పట్టాలు లేక పోడుభూముల గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి నానాఅవస్థలకు గురయ్యారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అందించిన పోడుభూముల పట్టాలతో గిరిజనుల సమస్యలు పటాపంచలు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపాలన్నారు. మిగతా వారికి కూడా పట్టా సర్టిఫికెట్లు వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు.