అధికారం కోసమే బీజేపీ, కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు
సర్కారు దవాఖానలు, బడుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
సాధారణ కాన్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
చేర్యాలలో రూ.9కోట్లతో ఆధునిక వైద్యశాల
హుస్నాబాద్లో రూ.10కోట్లతో 50 పడకలతో ఎంసీహెచ్ నిర్మిస్తాం
ఈ నెల 12న గౌరవెల్లి ట్రయల్ రన్…
నిత్యాన్నదాన సత్రానికి నెల వేతనం విరాళం
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
‘స్వయంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న పథకాలను వాళ్ల రాష్ట్రంలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిండు.. గిట్లా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు.. వాళ్లది కత్తి కాదు.. నెత్తి కాదు’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం హుస్నాబాద్, అక్కన్నపేట, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, కొండపాక మండలాల్లో మంత్రి హరీశ్రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. హుస్నాబాద్లో గౌరవెల్లి రిజర్వాయర్తో పాటు శనిగరం ప్రాజెక్టు, హుస్నాబాద్ ఎల్లమ్మచెరువుకు సంబంధించిన పనుల ప్రగతిని సమీక్షించిన ఆయన, ఈ నెల 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్లో భాగంగా ప్రాజెక్టులో నీళ్లు పోయిస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్కారు బడులు, దవాఖానల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని, ప్రైవేటు దవాఖాన, పాఠశాలలు ఉండేలా సర్కారు బడులు, దవాఖానల్లో వసతులు కల్పిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుకు దక్కుతుందన్నారు.
చేర్యాల/మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 7 : అబద్ధాల పునాదులపై బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని, అధికారం కోసమే ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్, మద్దూరు మండలం నర్సాయపల్లి, చేర్యాల మండలం ముస్త్యాల, చేర్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మాజీ చీఫ్ విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాయపల్లి, ముస్త్యాల, కొండాపూర్ గ్రామాల్లో సర్పంచులు బద్దిపడగ లలితకృష్ణారెడ్డి, పెడుతల ఎల్లారెడ్డి, బాదావత్ రేఖశ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకమైన అమలు చేస్తున్నారా? అన్ని ప్రశ్నించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో సైతం అభివృద్ధి కుంటుపడిందని, వడ్లు కొనాలని రాష్ట్రంలో గగ్గోలు పెట్టిన బండి సంజయ్, కర్ణాటకలో వడ్లు ఎందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటకలో రూ.1400 క్వింటాలు వడ్లు కొనుగోలు చేస్తే, అదే తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కాంక్షించి సీఎం కేసీఆర్ రూ.1960 క్వింటాలు వడ్లు కొంటున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని రైతులు సైతం తమ వడ్లను తెలంగాణలో అమ్ముకుంటున్న విషయం బీజేపీ వాళ్లకు తెలియదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్కారు బడులు, దవాఖానల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని, ప్రైవేటు దవాఖాన, పాఠశాలలు ఉండేలా సర్కారు బడులు, దవాఖానల్లో వసతులు కల్పిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుకు దక్కుతుందన్నారు. చేర్యాలలో రూ.9కోట్లతో ఆధునిక వైద్యశాల అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
గౌరవెళ్లి తదితర ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష
హుస్నాబాద్టౌన్, జూన్ 7: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. గౌరవెళ్లి రిజర్వాయర్ తోపాటు శనిగరం ప్రాజెక్టు, హుస్నాబాద్ ఎల్లమ్మచెరువుకు సంబంధించిన పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సమీక్షలో కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టుకు అదనంగా నిధులను మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మంత్రి హరీశ్రావు అధికారులకు సూచించినట్లు తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు పనులను త్వరగా పూర్తిచేయాలని అవసరం అనుకుంటే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని మంత్రి వివరించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సీపీ శ్వేత, జెడ్పీవైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డితోపాటు ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నర్సాయపల్లికి పల్లె దవాఖాన
మద్దూరు మండలం నర్సాయపల్లిలో పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ నిర్మాణానికి తక్షణమే రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు చేసి మందులు అందజేస్తామన్నారు. నర్సాయపల్లి గ్రామంపై తనకు ప్రత్యేకమైన ప్రేమ ఏర్పడిందని, దానికి తగ్గట్టుగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కొండపూర్లో గ్రామం నుంచి వీడిపోయి మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన హనుమతండా, దుబ్బుతండా, రెడ్యానాయక్ తండాల్లో జీపీల నిర్మాణాలకు నిధులు మం జూరు చేయనున్నట్లు తెలిపారు. చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు రూ.20కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నర్సాయపల్లిలో రూ.70లక్షల వ్యయంతో నిర్మించే ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా భవనం, ఓపెన్ జిమ్, అంగన్వాడీ కేంద్రం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముస్త్యాలలో రూ.15లక్షల వ్యయంతో నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. చేర్యాల మున్సిపాలిటీ నాల్గో వార్డులో రూ.2కోట్ల60 లక్షల వ్యయంతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొండాపూర్లో రూ.28లక్షల వ్యయంతో నిర్మించే ఎస్టీ,ఎస్సీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. హనుమతండాలో రూ.20ల ఎస్టీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, దుబ్బతండాలో రూ.20లక్షలతో ఎస్టీ కమ్యూనిటీ హాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.
మంత్రికి ఘన స్వాగతం
వివిధ మండలాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి రాక సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కొండాపూర్ నుంచి నర్సాయపల్లి వరకు బైక్ ర్యాలీలు తీస్తూ పువ్వులు చల్లుతూ స్వాగతం పలికారు. నర్సాయపల్లిలో మంత్రి హరీశ్రావును ఎంపీపీ కృష్ణారెడ్డి గజమాలతో సత్కరించి, మెమోంటో అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్లు నిమ్మ రాజీవ్రెడ్డి, పుర్మ వెంకట్రెడ్డి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు మేక సంతోష్, మంద యాదగిరి, అనంతుల మల్లేశం, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నాగిల్లి తిరుపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చేర్యాలపై మంత్రికి ప్రత్యేక అభిమానం
జనగామ నియోజకవర్గానికి చెందిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల అభివృద్ధిపై మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక అభిమానం ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చేర్యాల ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు తాను ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇటీవల చేర్యాల మున్సిపాలిటీకి రూ.15కోట్లు, నాలుగు మండలాలకు రూ.8కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి హరీశ్రావుకు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారన్నారు.