సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి), మార్చి 23: భువనగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం చెందిన క్యామ మల్లేశ్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ స్వగ్రామం. ఆయనకు భార్య క్యామ జంగమ్మ, కుమారుడు అంజన్కుమార్, కుమార్తెలు ప్రియాంక, అవంతి, అరోణి ఉన్నారు.
ఇంటర్ వరకు చదివిన క్యామ మల్లేశ్ 1992లో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్, 2003లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ను వీడి 2018లో బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పనిచేసి పార్టీ అధినేత కేసీఆర్ మన్ననలు పొందారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు ఆయనకు బీసీ వర్గాల్లో మంచి పట్టున్నది.
ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ, ఆయన స్వతహాగా పోరాట పటిమ కలిగిన నాయకుడు. బీసీలతో పాటు ఆయన సామాజికవర్గం అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషిచేశారు. మల్లేశ్ స్వగ్రామం శేరిగూడలో మొదటిసారి పంచాయతీ సభ్యుడిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం ఆయన స్వశక్తితో అనేక పదవులు పొంది విజయవంతంగా నిర్వర్తించి మంచి గుర్తింపు పొందారు.