డబ్బులు పోగొట్టుకున్న బాధితులు డయల్ 100 కు లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ సెల్: 8712667100 నంబర్కు సమాచారం ఇవ్వాలి: పోలీసులు
సిద్దిపేట రూరల్, డిసెంబర్1: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ దందా అంతా రహస్యంగా కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు విజయం సాధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ పోటీ ఆసక్తిగా మారింది. హుస్నాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు, జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్రెడ్డి మధ్య తీవ్రపోటీ నెలకొంది.
దీంతో వీరిలో ఎవరు గెలుస్తారనే విషయం మరో 48 గంటల్లో తేలనుంది. ప్రధానంగా సిద్దిపేట మినహాయిస్తే హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, జనగామపై బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ దందాలో గతంలో క్రికెట్ బెట్టింగ్లో ఆరితేరిన వారు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్థాయి ,అర్హతను బట్టి రూ.5 వేల నుంచి లక్ష వరకు బెట్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్కు ప్రతికూలంగా వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా బెట్టింగ్లో ఎంతోకొంత వెనుకేసుకోవాలనే ఉద్దేశంతో ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.
ఈ బెట్టింగ్లో వివిధ పార్టీలకు చెందిన కిందిస్థాయి నాయకుల నుంచి మండల, జిల్లా స్థాయి నాయకుల వరకు ఉన్నట్లు సమాచారం. ఫలితాలు తారుమారు అయితే బెట్టింగ్లో నగదు భారీగా పోకుండా ఉండేందుకు ఆర్థిక స్థోమతను బట్టి తక్కువ మొత్తంలో డబ్బు పెడుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగే ఇలాంటి బెట్టింగ్పై ఎప్పటికప్పుడు జిల్లా టాస్క్ఫోర్స్ నిఘా పెడుతోంది. బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే , ఈ దందాలో ఎవరైనా నగదు పోగొట్టుకున్న బాధితులు ఉంటే డయల్ 100కు లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ సెల్: 8712667100 నంబర్కు సమాచారం ఇస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.