సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో మా లాంటి వారికి ఎంతో మేలు జరుగుతుంది. మాకు సొంత స్థలం ఉన్నది. కానీ, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక అదే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నాం. ఇద్దరు ఆడపిల్లలతో గుడిసెలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. నేను మా భర్త కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం డబ్బులు ఇస్తే మంచి ఇల్లు నిర్మించుకుంటాం.
– కొత్తకుమ్మరి సంతోష, గూడూరు, శివ్వంపేట మండలం
పేదల గృహ నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. గూడులేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూనే గృహలక్ష్మి పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ. 3 లక్షల చొప్పున సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ‘గృహలక్ష్మి’ పథకం కింద మొత్తం 33 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. దళిత బంధు పథకం కింద నియోజకవర్గానికి 1100 మందికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 12 వేల మందికి దళితబంధు పథకం వర్తించనున్నది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం 100 మందికి దళితబంధు వర్తింపజేయగా, వారు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ మరో పది మందికి
ఉపాధి చూపుతున్నారు.
– సిద్దిపేట, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మద్దూరు(ధూళిమిట్ట), మార్చి10: రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబం రెండేండ్ల క్రితం పెద్దదిక్కును కోల్పోయింది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఇద్దరు ఆడబిడ్డల ఆ తల్లి ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేయనున్న ‘గృహలక్ష్మి’ ఇల్లు కోసం వేయికండ్లతో ఎదురు చూస్తున్నది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్ గ్రామానికి చెందిన మీస కవిత భర్త సత్యనారాయణ 2021లో అద్దె ఇంట్లో చనిపోయాడు. సత్యనారాయణ మృతదేహాన్ని అద్దె ఇంటి ముందు ఉంచడానికి ఆ ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో భర్త మృతదేహాన్ని టెంటు కింద ఉంచి గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రస్తుతం కవిత వృద్ధురాలైన అత్త బాలవ్వ, 13 ఏండ్ల పెద్ద కూతురు మానస, 11 ఏండ్ల చిన్న కూతురు అమూల్యతో అద్దె ఇంట్లో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ
రోజులు గడుపుతున్నది.
గూడులేని నిరు పేదలకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పెద్ద ఎత్తున డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అర్హులైన పేదలకు నయాపైసా ఖర్చు లేకుండానే ఇంటి తాళాలు అప్పగించి గృహప్రవేశాలు చేయించింది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేపడుతూనే సొంతింటి జాగ ఉన్న వారికి ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.“గృహాలక్ష్మి” పథకం కింద ఇల్లాలి పేరు మీద రూ. మూడు లక్షలు అందజేస్తారు. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో “గృహలక్ష్మి” పథకం కింద 33 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో మరిన్ని యూనిట్లు అదనంగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. – సిద్దిపేట, మార్చి10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గూడులేని నిరు పేదలకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. సొంత జాగలున్న నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేపడుతూనే సొంతింటి జాగ ఉన్న వారికి ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. “గృహలక్ష్మి” పథకం కింద రూ.మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సాయం కూడా ఇల్లాలి పేరు మీదనే ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి ఆర్థికసాయం అందిస్తారు. ఒక్కో విడతలో లబ్ధిదారుడికి రూ. లక్ష చొప్పున ఖాతాలో జమ చేస్తారు. ఇలా మూడు విడతల్లో ఇస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి.ఇవి కాకుండా సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలు కొంత భాగం ఉన్నాయి.ఈ లెక్కన ఉమ్మడి మెదక్ జిల్లాకు “గృహలక్ష్మి” పథకం కింద మొత్తం కలిపి 33 వేల మందికి లబ్ధి చేకూరనున్నది.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో అదనంగా మరిన్ని వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దళిత బంధు పథకం కింద నియోజకవర్గానికి 1100 మందికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో (ఉమ్మడి మెదక్లోని 10 నియోజకవర్గాలతోపాటు కొత్తగా సిద్దిపేట జిల్లాలో చేరిన హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలు, మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలాలు ఉన్నాయి) సుమారు 12 వేల మందికి దళితబంధు పథకం వర్తించనున్నది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం అందించింది. వారంతా సొంతంగా తమ వ్యాపారాలు చేసుకుంటూ మరో పది మందికి ఆసరాగా నిలుస్తున్నారు.
రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవీరవీందర్
కొండపాక(కుకునూరుపల్లి), మార్చి 10: గృహలక్ష్మి పథకంతో ప్రభుత్వం పేదలకు భరోసా ఇస్తున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవీ రవీందర్ అన్నారు. శుక్రవారం వెలికట్టె క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదల కోసం గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్థికసహాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమన్నారు. హుస్సేన్సాగర్ తీరాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏప్రిల్ 14న చేస్తానని ప్రకటించడం, తెలంగాణ పరిపాలనా భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని తీసుకున్న నిర్ణయంతో మరోసారి రైతు ప్రభుత్వంగా ముద్రవేసుకుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఇప్పటికే 1,194 కుటుంబాలకు అందిన దళిత బంధు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం దళిత బంధు. ఈపథకాన్ని మరింతగా విస్తరించాలని చెప్పి కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి బడ్జెట్లో సైతం భారీగా నిధులు కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలో తొలి విడతలో వంద మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక చేయూతను అందించింది. 60కి పైగా వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 495 కుటుంబాలకు రూ.45.50 కోట్లు, మెదక్ జిల్లాలో 255 కుటుంబాలకు రూ.25.50 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 444 కుటుంబాలకు రూ.44.40 కోట్లు అందించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,194 కుటుంబాలకు రూ 115.40 కోట్లు లబ్ధిదారులకు అందించింది. ప్రభుత్వం అందించిన సాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 1,100 మందికి దళిత బంధు వర్తించనున్నది. ఈలెక్కన ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరువు నియోజకవర్గాలతో పాటు సిద్దిపేట జిల్లాలో జనగామ నియెజకవర్గంలోని నాలుగు మండలాలు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం ఉన్నాయి. 11 నియోజకవర్గాల్లో సుమారు 12 వేల మందికి లబ్ధి చేకూరనున్నది.
సొంతింటి జాగ ఉంటే రూ. 3లక్షల ఆర్థిక సాయం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అర్హులైన పేదలకు నయా పైసా ఖర్చు లేకుండానే ఇంటి తాళాలు అప్పగించి గృహప్రవేశాలు చేయించి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. మోడల్ కాలనీలు నిర్మించింది. సిద్దిపేట జిల్లాలోని నర్సాపూర్ వద్ద నిర్మించిన కాలనీకి కేసీఆర్ నగర్గా నామకరణం చేసింది. ఈ ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. జిల్లాలో ఎక్కడికక్కడ ఇండ్ల నిర్మాణాలు జరిగినవి జరిగినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా అందించింది. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరగా పూర్తిచేసి నిరుపేదలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పనుల్లో స్పీడు పెంచింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నది. దీంతో ఇంటి నిర్మాణాలు చేసుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంతో వారికి ఆసరాగా నిలుస్తుంది.
అర్హులకు న్యాయం జరుగుతుంది…
గతంలో చాలా మంది తమ పలుకుబడితో పైరవీలు చేసి ఇండ్లు మంజూరు చేయించుకున్నారు. మాలాంటి పేదలకు న్యాయం జరగలేదు. నేడు ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి ద్వారా లబ్ధి చేకూరుతుందని నమ్మకం కలుగుతుంది. సొంత స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక చాలా సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం. పాత ఇల్లు కొంత బాగుచేసుకున్నప్పటికీ అసౌకర్యంగా ఉంది. ప్రభుత్వం సొంతింటి నిర్మాణానికి రూ.3లక్షలు ప్రకటించడం సంతోషంగా ఉంది. – దండు లక్ష్మి, దామరచెర్వు,
రామాయంపేట మండలం.
మా లాంటి పేదలకు ఎంతో మేలు
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో మా లాంటి వారికి ఎంతో మేలు జరుగుతుంది. మాకు సొంత స్థలం ఉన్నది. కానీ, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక అదే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నాం. ఇద్దరు ఆడపిల్లలతో గుడిసెలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. నేను మా భర్త కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం డబ్బులు ఇస్తే మంచి ఇల్లు నిర్మించుకుంటాం.
– కొత్తకుమ్మరి సంతోష, గూడూరు, శివ్వంపేట మండలం
ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకుంటాం
మా ఇల్లు పూర్తిగా దెబ్బతింది. సొంతజాగ ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షలు సాయం చేస్తుందని టీవీలో చూశా. వానకాలం పాత ఇంట్లో ఎట్లుండాలో అనుకుంటున్నా. స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ. 3లక్షల సాయం చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం అందించే రూ.3లక్షలతో ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు లేని వారికి ప్రభుత్వం అందించే సాయం మరువలేనిది. ఇల్లు కట్టుకునేవాళ్లకు రూ.3లక్షలు అందజేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉంటారు.
– మెరుగు భాగ్యలక్ష్మి, రసూలాబాద్, కొమురవెల్లి మండలం
నిరుపేదలకు పక్కా ఇండ్లు
నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టివ్వడానికి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టడం హర్షణీయం. పూరిగుడిసెలు, రేకుల ఇండ్లు, అద్దె ఇండ్లల్లో నివసిస్తున్న పేదలకు ఈ పథకం గొప్పవరం. సొంతస్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి సొంతింటి కలను సాకారం చేయనున్నది. ఈ పథకం విజయవంతం అవడంతో పాటు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల్లో ‘గృహలక్ష్మి’ మరో మైలురాయిగా నిలువనున్నది.
-కప్పెర మహేశ్, బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు, ఊట్ల, జిన్నారం మండలం.
బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు
నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ఆయన సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నది.సొంతగా ఖాళీ స్థలం ఉండి ఇల్లులేని నిరుపేదలకు ‘గృహలక్ష్మి పథకం’ ద్వారా ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షలు అందిస్తుందని చెప్పడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఈ ప్రకటనతో మా లాంటి ఎంతో మంది నిరుపేదల సొంతింటి కల నెరవేరనున్నది. ప్రజాసంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతున్న ఒకే ఒక వ్యక్తి సీఎం కేసీఆర్ సార్. బీఆర్ఎస్ పార్టీకి దేశంలోనే తిరుగులేదు. – ఎర్ర ఎల్లయ్య, రైతు, నిజాంపేట మండలం.
మూడు లక్షల సాయం సంతోషకరం
సొంత జాగ ఉన్న వాళ్లకు ప్రభుత్వం మూడు లక్షల సాయం చేస్తానని చెప్పడం సంతోషకరం. మాకు పెంకుటిల్లు ఉంది. వర్షాలకు ఇల్లు కూలేటట్లు ఉన్నది. ఇల్లులేని వాళ్లకు ఇల్లు కట్టుకునేందుకు సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం కింద సాయం చేస్తామని చెప్పడం వల్ల ఎంతోమంది పేదలకు లబ్ధిచేకూరనుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆసరాగా ఉండడం ఆనందంగా ఉంది. ఇన్నేండ్లు ఇల్లు కట్టుకుంటామా లేదా అనే బాధ ఉండేది. ఇంత మంచి గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– బాలింగుల బాలవ్వ, చాట్లపల్లి గ్రామం, జగదేవ్పూర్ మండలం
మంచి పథకం..
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ఎంతో మంచిది. పేదవారి సొంతింటి కల నెరవేరేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షలు ఇస్తే వారికి నచ్చినట్లుగా ఇల్లు నిర్మించుకుంటారు. గతంలో ఇండ్ల కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నది. ఇది కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది.
సబ్సిడీ గొర్రెలతో సంతోషంగా ఉన్నం..
మాకు సీఎం కేసీఆర్ సార్ 20 గొర్లు, ఒక్క పొట్టేలును ఇచ్చారు. 75 శాతం సబ్సిడీ గొర్రెలు ఇవ్వడంతో అట్టి ఫలాలను అనుభవిస్తూ మా గొల్ల కుర్మలు మస్తు సంతోషంగా ఉన్నరు. మరో విషయం ఏమిటంటే గొర్రెలు అనాగోగ్యం గురైతే ఉచితంగా మందులు, డాక్టర్లను మా గొర్రెల మంద వద్దకే పంపించి పరీక్షలు చేపిస్తున్నర్రు. గొర్రెలు, మేకలు ఏదైనా ప్రమాదంలో చనిపోతే గొర్రెలకు రూ.5000, పొట్టేలుకు రూ. 7000 బీమా ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్ సారుకు మేమందరం రుణపడి ఉన్నం.
– కన్నెబోయిన రాజు యాదవ్, లబ్ధిదారుడు, కమ్మర్లపల్లి
దళితబంధు తొవ్వ చూపింది..
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి.మాలాంటి వారిని ఎవరు పట్టించుకోలేదు. ఎన్నికలప్పుడు మాత్రమే మా దగ్గరికి అచ్చి హడావిడి చేసి వెళ్లేవార. దళితులు మంచిగా బతుకాలే. వాళ్లు ఎవ్వరికి నామోషి ఉండద్దని సీఎం కేసీఆర్ సార్ ఒక్కడే మమ్ములను పూర్తిగా అర్ధం చేసుకుండు.కూలీలుగా మారి ఎంత పనిచేసినా వచ్చే పైసలు అడికాడికే అయ్యేవి. సీఎం కేసీఆర్ సార్ ‘దళితబంధు పథకం’ పెట్టి కూలీలుగా ఉన్న మమ్మల్ని ఓనర్లుగా మార్చిండు. మా రాంపూర్ గ్రామంలో 18 మంది దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు యూనిట్లను ఇచ్చింది. నేను ఇంకో లబ్ధిదారునితో కలిసి హార్వేస్టర్ కొనుగోలు చేసిన. ఇప్పుడు మాకు ఉపాధి లభిస్తున్నది.
-ఏల్ల పోచయ్య, దళితబంధు లబ్ధిదారుడు,రాంపూర్
దళితబంధు మా జీవితాన్ని మార్చింది..
హైదరాబాద్లో రోజు వారి కూలీగా పనిచేసే వాడిని. కరోనా తరువాత మా సొంత గ్రామమైన హసన్ మహమ్మద్ పల్లికి వచ్చాం. కరోనా కారణంగా చాలా ఇబ్బందిపడ్డం. వ్యవసాయ కూలీగా పనికి వెళ్లేవాన్ని. నాతో పాటు నా భార్య పనికి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం దళితబంధు కింద అందించిన సాయంతో టెంట్హౌస్ పెట్టుకున్న. ఇప్పుడు నేను, నా కుటుంబం జీవించడానికి ఒక తొవ్వ దొరికింది. సీజన్లో ఆదాయం మంచిగ ఉంటున్నది. నెలలో కనీసం 20 రోజులు మాకు గిరాకీ వస్తున్నది.
– నర్సింలు, దళితబంధు (టెంట్హౌస్) లబ్ధిదారుడు, టేక్మాల్
పేదలకు వరం
ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టడం పేదల పాలిట వరంగా భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోశంగా ఉంది. మాకు ఇప్పడు రేకుల ఇల్లు ఉంది. నాలాంటి వారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. గృహలక్ష్మి కింద సొంతజాగా ఉన్న వారికి రూ.3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం.
– ఫక్రుద్దీన్, వీరన్నగూడెం, గుమ్మడిదల మండలం
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం
సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఎన్నో ఎండ్లుగా ఎదురు చూస్తున్నాం. సొంత స్థలం ఉన్నప్పటికీ గతంలో ఇల్లు మంజూరు కాలేదు. చాలాసార్లు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. అప్పటి నుంచి నేటి వరకూ ఇల్లు కట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రయత్నాలు మానేశా. ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకం’ ప్రవేశపెట్టి మాలాంటి వారికి శుభవార్త చెప్పింది. ఈ పథకంతో ఎంతో మేలు జరుగుతుంది. పైరవీలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు దశలవారీగా ఇస్తామని ప్రకటించడం హర్షణీయం.
– సంగీత, సుతారిపల్లి, రామాయంపేట మండలం