విభిన్న పంటల పరిశోధనకు బసంతపూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం గుర్తింపు
చెరుకు, గోధుమ పంటలపై పరిశోధనలు
యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన
న్యాల్కల్, మే8: మండలంలోని బసంత్పూర్- మామిడ్గి గ్రామ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విభిన్న పంటల పరిశోధనకు కేరాఫ్గా నిలిచింది. ఈ కేంద్రంలో అధిగ దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానంతో మేలు రకం విత్తనాలు, వంగడాలు తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లోని పలు కంపెనీల యజమానులు అక్కడి రైతులను ఈ కేంద్రానికి తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు. అనతి కాలంలోనే శాస్త్రవేత్తల పరిశోధనలతో దేశంలోనే బసంత్పూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
చెరుకు, గోధుమ పంటలపై పరిశోధనలు
ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన ఎర్రరాయి గుట్టలే. వర్షాధారం పంటలు పండిద్దామన్నా ఈ నేలలు పనికిరావు. ఆ ఎర్రరాయిపైనే పరిశోధనలు చేసి పంటలు పండించాలనే ఉద్దేశంతో 2010లో 80 ఎకరాల విస్తీర్ణంలో ఆచార్య ఎన్జీ రంగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి ఎర్రరాయి భూములను చదును చేసి పంటలపై పరిశోధన చేయడం మొదలు పెట్టారు. ఈ భూముల్లో ఏం చేస్తారని అనుకున్న ఇక్కడి ప్రజలు ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి పంటలు పండించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ పర్యవేక్షణలో చెరుకు, గోధుమ, షుగర్ బీట్ పంటలపైనే పరిశోధన చేస్తున్నారు.
చెరుకులో దాదాపు 170 రకాల పరిశోధనలు చేశారు. ఈ ప్రాంతం పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలు ఎంపిక చేసి వాటిపై పరిశోధన చేసి రైతులకు అందజేశారు. వాటిలో 8005, 93V297, 83A30, 86032, 9520, 87025 రకాల చెరుకు పండిస్తున్నారు. చెరుకుకు ప్రత్యామ్నాయంగా షుగర్ బీట్ పంటను పండిస్తున్నారు. ప్రస్తుతం రైతులు పండిస్తున్న చెరుకు కర్ర రూపంలో ఎత్తుగా ఎదుగుతుంది. కానీ షుగర్ బీట్ మాత్రం భూమిలోపల దుంప రూపంలో పండుతుంది. శాస్త్రవేత్త విజయ్కుమార్ పర్యవేక్షణలో 8 రకాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో ఒక్కోరకం దిగుబడి ఇవ్వనున్నది. త్వరలోనే షుగర్ బీట్ పంటను పండించుకునేందుకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
నూతన వంగడాలపై అవగాహన
తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన చక్కెర కార్మాగార యజమానులు ఈ పరిశోధన కేంద్రానికి సంబంధిత అధికారులు, సిబ్బంది, రైతులను తీసుకొచ్చి నూతన వంగడాలు, యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారు. చెరుకునే కాకుండా గోధుమలో 45 రకాలపైగానే పరిశోధనలు చేశారు. వాటిలో ప్రధానంగా డీడబ్ల్యూఆర్162, పీడీడబ్ల్యూ 533, అధిత్య, ఎంఏసీఎస్ రకాలు గోధుమను ఈ ప్రాంతంలో రైతులు పండించుకునేందుకు వీలుగా శాస్త్రవేత్తలు తయారుచేశారు. రెండు, మూడు నీటి తడులతో తక్కువ కాల పరిమితిలో హెక్టార్కు 20, 30 క్వింటాళ్ల దిగుబడి సాధించేలా గోధుమ పంటపై పరిశోధనలు చేశారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చెరుకు, గోధుమ, షుగర్బీట్ పంటలపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు.
కొత్త వంగడాలపై అవగాహన
కొత్త వంగడాలు, సంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ పద్ధతులను రైతులకు అందించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాం. పరిశోధన కేంద్రంలో ప్రధానంగా చెరుకు, గోధుమ పంటలపై పరిశోధనలు చేస్తున్నాం. తెలంగాణ లో పరిస్థితులకు అనుగుణంగా చెరుకు, గోధుమ పంటలను పండించుకునేందుకు వీలుగా కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– డాక్టర్ విజయ్కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, బసంత్పూర్