మెదక్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): 60 ఏండ్ల పైబడిన వృద్ధ మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో వారినీ కొనసాగించాలని నిర్ణయించింది. జిల్లాలోని ఆయా గ్రామాల్లో వృద్ధుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందజేస్తున్నది. ఈ క్రమంలోనే మెదక్ జిల్లాలో 60 ఏండ్ల పైబడిన వృద్ధులు కొత్తగా 1352 మంది ఈ సంఘాల్లో చేరనున్నారు.
వృద్ధులు ఇబ్బంది పడకుండా..
సాధారణంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరడానికి 18 ఏండ్లు పైబడిన వారు అర్హులు. నాలుగేళ్ల క్రితం 60 ఏళ్లు పైబడిన మహిళలు కూడా ఈ సంఘాల్లో సభ్యులుగా ఉండేవారు. పలు నిబంధనలతో 60 ఏండ్లు పైబడిన వారిని సంఘాల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేండ్ల నుంచి ఐకేపీ సిబ్బంది వృద్ధ మహిళలను తొలగిస్తూ వస్తున్నారు. సంఘాల నుంచి బయటకొచ్చిన వీరు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక అవసరాలకు ఇతరులపై ఆధారపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ రూరల్ హుడ్ మిషన్ నిర్ణయం తీసుకున్నది. దీంతో వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్వయం ఉపాధికి రాష్ర్ట ప్రభుత్వం ప్రోత్సాహం..
పొదుపు సంఘాల్లో 60 ఏండ్ల పైబడిన వారు చేరడంతో పలు రకాలు మేలు చేకూరనున్నది. ప్రస్తుత సంఘ సభ్యులతో పాటు వీరు కూడా అన్ని రకాల సదుపాయాలు పొందే వీలుంటుంది. ప్రస్తుతం సంఘంలో ఉన్న సభ్యులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు. ఆయా డబ్బులతో అనేక మంది సొంతంగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ, టైలరింగ్, ప్లేట్ల తయారీ, జిరాక్స్ సెంటర్, డెయిరీ, కూరగాయల విత్తనోత్పత్తి నర్సరీల నిర్వహణ తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 60 ఏండ్ల వృద్ధులు కూడా ఇలాంటి వ్యాపారాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది.
వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం
60 ఏండ్లు పైబడిన వారి వివరాలు సేకరిస్తున్నాం. మెదక్ జిల్లాలో 1352 మంది వృద్ధ మహిళలు ఉన్నట్టు గుర్తించాం. గ్రామాల్లోని ఆయా గ్రూపుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి, సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించాం. వివరాల ఆధారంగా ఐకేపీ సిబ్బంది ఆ మహిళలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు.
– శ్రీనివాస్, డీఆర్డీవో, మెదక్