Minister Harish Rao | సిద్దిపేట అర్బన్, జూలై 5 : కాలం కావడం లేదని అధైర్య పడొద్దని.. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటారని.. కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు, కుంటలు నింపుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో ఆయిల్పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు రెండు నుంచి మూడు వందల స్పింక్లర్ సెట్లు రాలేదు.. కానీ, తెలంగాణలో ఒక్క రోజే 1001 సెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సిద్దిపేట జిల్లాలో రెండేండ్లలో రూ.20.18 కోట్ల సబ్సిడీపై 17వేల స్ప్రింక్లర్ల సెట్లను పంపిణీ చేశామన్నారు. చిన్నకోడూరు మండలానికే 5 వేల స్పింక్లర్ సెట్లను అందజేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్, స్పింక్లర్ సెట్లను అందజేశామని తెలిపారు.
రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం నీళ్లు తెచ్చామని.. ఇది రైతు పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. కాలం కాకుంటే కాళేశ్వరం నీళ్లతో చెరువులు, కుంటలను నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రెండు పంటలు పండుతున్నట్లు తెలిపారు. ఒక్కో బోరు మోటర్కు రూ.25 వేలు కరెంట్ బిల్లు వస్తే.. ఆ బిల్లును ప్రభుత్వం చెల్లిస్తుందని, ఇది రైతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా 7 గంటలకు మించి కరెంట్ వచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ లాంటి నాయకుడు లేక.. కరెంట్ రాలేదన్నారు.
మహారాష్ట్రలో కూడా 6, 7 గంటలకు మించి కరెంట్ రావట్లేదన్నారు. రంగనాయకసాగర్లో 3 టీఎంసీల నీళ్లు తెచ్చి నింపామన్నారు. మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదకన పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించామని, దీనిని రైతులందరూ గమనించాలని మంత్రి హరీశ్రావు సూచించారు. తొమ్మిదేం డ్లలో రూ.60 వేల కోట్లు వ్యవసాయ బిల్లులను కరెంట్ డిపార్ట్మెంట్కు ఖర్చు చేశామని, రైతుబంధు ద్వారా రూ. 72 వేల కోట్లు పెట్టుబడి సాయం చేశామని, రైతుబీమా ద్వారా రూ.5300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. తెలంగాణ ప్రజలు ఎండమావులకు ఆశపడద్దని.. ధోకేబాజ్లకు లొంగవద్దని మంత్రి హరీశ్రావు హితవు పలికారు.
అధైర్యపడొద్దు.. సీఎం కేసీఆర్ అండగా ఉంటారు..
దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్ నింపి చేర్యాల, కొమురవెల్లి ప్రాంత రైతులకు నీళ్లు అందిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి, కొండపోచమ్మ సాగర్ ద్వారా గజ్వేల్, మెదక్, రామాయంపేటకు, రంగనాయకసాగర్ ద్వారా సిద్దిపేట, ముస్తాబాద్ ప్రాంతాలకు, అంతగిరి పోచమ్మ రిజర్వాయర్ ద్వారా బెజ్జంకి, గన్నేరువరం, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గానికి నీళ్లు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని.. సీఎం కేసీఆర్ అండగా ఉంటారన్నారు. కాలం అయితదా? కాదా? అనే ఆందోళన వద్దని, కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలను నింపుతామని భరోసా ఇచ్చారు. ఇటీవల గౌరవెళ్లి ప్రాజెక్ట్ పంపును ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రారంభించారని గుర్తు చేశారు. ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. గౌరవెల్లి పూర్తి చేసి, హుస్నాబాద్ ప్రాంతానికి గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. ప్రజల సంతోషమే బీఆర్ఎస్ ప్రభుత్వ సంతోషమని మంత్రి హరీశ్రావు అన్నారు.
ఆయిల్పామ్ సాగు చేపట్టాలి
ఆయిల్పామ్ సాగు లాభదాయకమని, ఈ పంటను రైతులు అందిపుచ్చుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లాలో 8,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారని, ఈ యేడాది 18 వేల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆయిల్పామ్తో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం వస్తున్నదన్నారు. ఆయిల్పామ్ సాగుకు వడగండ్ల వాన, కోతుల బెడద, పందుల, చీడ పీడ బెడద ఉండదన్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.88 వేల సబ్సిడీ ఇస్తుందని, రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంట మార్పిడి చేయాలని సూచించారు. వరిసాగులో వెదజల్లే పద్ధ్దతిని పాటించాలన్నారు. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేస్తే పంట కాలాన్ని నెల ముందుకు తీసుకురావచ్చన్నారు. ముందుగా ఆయిల్పామ్ కమిటీ జిల్లా సభ్యులుగా ఎన్నికైన రైతులు తిరుపతిరెడ్డి, సుధాకర్రెడ్డి, నాగేంద్రం, వెంకట రవీందర్ రెడ్డిని మంత్రి హరీశ్రావు సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ జిల్లా అధికారి సునీత, ఆయిల్పామ్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, ఎంపీపీలు మాణిక్యరెడ్డి, బాలమల్లు, కీర్తి, జడ్పీటీసీలు తడిసిన ఉమ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బద్దిపడగ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.