మెదక్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానికి పోటెత్తారు. గ్రామాల్లో ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. గ్రామాల్లో ఓటు హకును వినియోగించుకునేందుకు నగరాల్లో ఉండే ప్రజలు పల్లెబాట పట్టారు. ఉదయం 11 గంటల వరకు మెదక్ నియోజకవర్గంలో 30.11 శాతం పోలింగ్ కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 30.42 శాతం ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతం అమాంతంగా పెరిగింది. మెదక్ నియోజకవర్గంలో 50.62 శాతం పోలింగ్ కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 50.97 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు మెదక్ జిల్లాలో 69.33 శాతం పోలింగ్ కాగా, మెదక్ నియోజకవర్గంలో 69.42 శాతం, నర్సాపూర్ నియోజకవర్గంలో 69.24 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు మెదక్ నియోజకవర్గంలో 85.03 శాతం పోలింగ్, నర్సాపూర్ నియోజకవర్గంలో 88.04 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా జిల్లాలో 86.69 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా తెలిపారు.
మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 80. 28 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.99 శాతం నమోదు, 11 గంటలకు 30.11 శాతం, మధ్యా హ్నం ఒంటి గంటకు 50.62 శాతం నమోదైంది. 3 గంటలకు 69.42 శాతం, 5 గంటల వరకు 85.03 శాతం నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలో ఉదయం 9 వరకు 9.01 శాతం, 11 గంటలకు 30.42 శాతం, మధ్యా హ్నం ఒంటిగంటకు 50.97 శాతం, 3 గంటల వరకు 69.24 శాతం, సాయంత్రం 5 గంటలకు 78.89 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తంగా 86.69 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు.
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం 2 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటేయడానికి అనుమతిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేశారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కాగా.. ఈ నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై నెలకొన్నది.