మక్తల్, మార్చి 20 : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ కార్యకర్తలకు కనీ స వేతనం రూ.18 వేల నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆశ కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు. మక్తల్ ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి నారాయణపేట జిల్లా ఆశ కార్యకర్తల అధ్యక్షుడు బాలమణి అధ్యక్షతన సీఐటీయూ జిల్లా నాయకుడు వెంకటరామిరెడ్డి, గోవిందరాజుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఆశ కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్ సీఐ రాంలాల్ తన సిబ్బందితో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆశ కార్యకర్తలను అడ్డుకున్నారు.
తమ డిమాండ్లను పరిషరించాలని మంత్రి ఇంటి ముట్టడిని శాంతియుత వాతావరణంలో చేపడితే, పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆశ కార్యకర్తలు ప్రశ్నిస్తూ, బారికేడ్ల్లు తోసుకుంటూ మంత్రి ఇంటి ఎదుట బైఠాయించి భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో సూచించిన విధంగానే, ఆశ కార్యకర్తల సమస్యలను పరిషరించి ప్రతి ఆశ కార్యకర్తలకు రూ.18వేతనం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆశ కార్యకర్తకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్తో పాటు రూ.5వేల దహన ఖర్చులు, రిటర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు తదితర హామీలు నేటి వరకు రేవంత్రెడ్డి నెరవేర్చలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500లతోపాటు పారితోషకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసి ఆశ కార్యకర్తలను ఆదుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి పీఏకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నారాయణపేట జిల్లా నాయకులు నరహరి, నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల ఆశ కార్యకర్తల యూనియన్ నాయకురాళ్లు గోవిందమ్మ, యశోద, ఇందిరమ్మ, సుజాత, లక్ష్మి, పార్వతమ్మ, వెంకటలక్ష్మి, ఫర్జానా బేగం, లతోపాటు ఆశ కార్యకర్తలు ఉన్నారు.