మెదక్ : 57 ఏండ్లు పైబడిన అర్హులైన నిరుపేదలకు ఆసరా పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి పింఛన్ల మంజూరుకై అర్హులైన జిల్లాలోని నిరుపేదలు మీ సేవ, ఈ సేవ కేంద్రాల ద్వారా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఇందుకోసం దరఖాస్తుదారులు సేవా రుసుంగా మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి సర్వీస్ రుసుము వసూలు చేయవద్దని ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా(సెర్ఫ్) మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఎవరైనా చార్జీలు వసూలు చేస్తే కేంద్ర నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆసరా పింఛన్లకు విద్యార్హత ధృవ పత్రం లేదా ఓటరు కార్డుపై ఉన్న పుట్టిన తేదీ ఆధారంగా 57 సంవత్సరాలు నిండి గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నరలోపు, పట్టణాలలో రెండు లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారు అనర్హులని ఆయన తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తుతో పాటు ఫొటో, ఆధార్ కార్డు, వయస్సును నిర్ధారించే ధృవపత్రం కేంద్రాలకు సమర్పిం చాలని సూచించారు. కేంద్రం నిర్వాహకులు దరఖాస్తుదారుల వివరాలు ఆన్లైన్ నమోదు చేసిన తర్వాత ధృవపత్రాలను తమ వద్దే ఉంచుకోవాలని సూచించారు.
నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందించి ఆదుకోవాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రస్తుతం 65 ఏళ్ల పైబడిన వారికే ఇస్తున్న పెన్షన్లు వయస్సును తగ్గించి 57 ఏండ్లు నిండిన అర్హులైన వారికి అందించాలని నిర్ణయించిందని అన్నారు. కావున జిల్లాలో అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆగస్టు 31లోగా సమీప మీ సేవ, ఈ సేవా కేంద్రాలోల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.