రామాయంపేట, అక్టోబర్ 16 : బతుకమ్మ, దసరా పండుగల సీజన్ ప్రారంభం కావడంతో దుకాణాలన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. మరో వారం రోజుల్లో పండుగలు రానుండటం విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు కావడంతో మార్కెట్లు కిక్కిరిసి పోతున్నాయి. రామాయంపేట పట్టణంలోని మహంకాళి, రాజేంద్ర నగర్, సిద్దిపేట చౌరస్తా, తెలంగాణ తల్లి విగ్రహాల్లో ఉన్న షాపుల్లో ఎటు చూసినా జనాలతో పండుగ వాతావరణం కనిపిస్తున్నది.
ముఖ్యంగా జనాల చూపంతా కొత్త బట్టలు కొనేందుకు రామాయంపేట పరిసర ప్రాంతాలైన నిజాంపేట, చిన్న శంకరంపేట, నార్సింగి,దౌల్తాబాద్, భిక్కనూరు, బీబీపేట మండలాల నుంచి తరలి వస్తున్నారు.పట్టణంలో రెండు రోజుల నుంచి బట్టల దుకాణాలతో పాటు బ్యాంగిల్స్, చెప్పుల షాపులు, జనరల్స్టోర్స్, బంగారు తదితర దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వ్యాపార సంస్థల్లో గిరాకులు ఎక్కువ ఉండడంతో పట్టణమంతా విక్రయదారులతో సందడి సందడిగా మారింది.