బోనాలు, బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, బాజాభజంత్రీలు, పోతరాజుల విన్యాసాలతో పల్లెలు మురిశాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెరువుల పండుగను అట్టహాసంగా నిర్వహించారు. ప్రజలు కుటుంబసభ్యులందరితో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా చెరువుల వద్దకు చేరుకుని ఆటపాటలతో సందడి చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ఉమ్మడిపాలకులు చెరువులను నిర్లక్ష్యం చేయడంతో చుక్కనీరు లేక ఎండిపోయి ఉనికే ప్రశ్నార్థకంగా మారిందన్నారు, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయలో పూడికతీయడంతో నేడు మళ్లీ జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. మండు వేసవిలోనూ నిండుకుండలా దర్శనమిస్తున్నాయన్నారు. భూగర్భజలాలు పెరిగాయని, ఉచితంగా చేపపిల్లలను వదలడంతో మత్స్యకారులకు జీవనోపాధి దొరికిందన్నారు. చెరువుల్లో పెరిగి పంటలకు పుష్కలంగా సాగునీరందుతున్నదన్నారు.
-సంగారెడ్డి/మెదక్ న్యూస్నెట్వర్క్, జూన్ 8
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఊరూరా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు కట్టలను అందంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. చెరువుల వద్ద ప్రజా ప్రతినిధులు పూజలు చేసి సంబురాలను ప్రారంభించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో చెరువుల వద్దకు వెళ్లి బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామస్తులంతా సహపంక్తి భోజనాలు చేశారు. చెరువుల్లో మత్స్యకారులకు దొరికిన చేపలను గ్రామస్తులకు పంచిపెట్టారు.
మెదక్/సంగారెడ్డి జిల్లాల నెట్ వర్క్ , జూన్ 8