రామచంద్రాపురం, మార్చి 29 : ఏదైనా సాధించాలనే తపన మనస్సులో గట్టిగా ఉంటే విజయం తప్పనిసరిగా వరిస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని విస్మరించకుండా ప్రయత్నాలు సాగిస్తే ప్రతిఒక్కరూ సక్సెస్ బాటలో నడుస్తారు. కొందరు పేద కుటుంబంలో ఉండొ చ్చు.. మరికొందరు తల్లిదండ్రులను స్ఫూ ర్తిగా తీసుకోవచ్చు.. మనం అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలంటే ప్రతి విషయంలో ఏకాగ్రత, సాధన తప్పనిసరి. అప్పుడే జీవితంలో మనం అనుకున్నది సాధిస్తాం. దీనికి పేద, ధనిక అని తేడా ఉండదు. ‘కష్టే ఫలి’ అనే ధోరణితో ముందుకు సాగాలి. ప్రసుత్తం ఉన్న పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అంత సులువు కాదు. ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగాల కోసం పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది. వందలో ఉన్న పోస్టులకు లక్షల్లో పోటీ పడుతున్నారు. అంటే ఒక ఉద్యోగం సాధించాలంటే ఈ పోటీ ప్రపంచంలో ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.. కానీ కొందరు వారి ప్రతిభతో ప్రభుత్వంలోనే రెండు, మూడు ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. ఆ కోవలోకి చెందిన వారే జూనియర్ అసిస్టెంట్ స్వర్ణలత.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మం డలం అబ్బెంద గ్రామానికి చెందిన ఎస్.స్వర్ణలత పదో తరగతి వరకు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో విద్యాభ్యాసం చేసింది. తర్వాత నారాయణఖేడ్లోని అనురాధ కాలేజ్లో ఇంటర్, డిగ్రీ చదువుకున్నది. డిగ్రీ అనంతరం 2012లో ఆమెకు వివాహం జరిగింది. ప్రసుత్తం ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఆమె తండ్రి సంజీవరెడ్డి నారాయణఖేడ్లోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవల రిటైర్డు అయ్యారు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో చిన్నప్పటి నుంచి స్వర్ణలతకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నది. సంజీవరెడ్డికి ఇద్దరు కుమారులు, కూతురు. పెద్ద కుమారుడు నవీన్రెడ్డి వ్యా పారి, చిన్న కుమారుడు ప్రవీణ్రెడ్డి వికారాబాద్లో ఎస్సైగా పనిచేస్తున్నారు. కూతు రు స్వర్ణలత సంగారెడ్డి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నది. స్వర్ణలత భర్త ప్రభాకర్రెడ్డి భువనగిరిలోని విజ్ఞాన్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వివాహం నుంచి ఆమె చందానగర్లో నివాసం ఉంటున్నారు.
సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఇంట్లో భర్త, పిల్లలు, ఇంటి పనులు అన్ని చూసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమైన. చిన్నప్పటి నుంచి నాన్నను చూసి ఆయనలా ప్రభుత్వ ఉద్యో గం సాధించాలనుకున్న. డిగ్రీలోనే వివాహం జరిగింది. అయినా నా కోరికను చంపుకోలేదు. భర్త, కుటుంబ సభ్యులు చాలా సహకారం అందించారు. పోటీ పరీక్షలో మొదట జూనియర్ పంచాయతీ కార్యాదర్శికి ఎంపికయ్యాను. ఆ తర్వాత వీఆర్వోగా, తర్వాత జూనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యాను. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న నాకు మూడు ఉద్యోగాలు రావడం చాలా సంతోషమనిపించింది. ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న. సాధించాలనే లక్ష్యంతో ముందుకు నడిస్తే విజయాలు తప్పనిసరిగా వరిస్తాయి.
– జూనియర్ అసిస్టెంట్ స్వర్ణలత
చిన్నప్పటి నుంచి నాన్నను స్ఫూర్తిగా తీసుకున్న స్వర్ణలత ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు పట్టుదలతో చదివింది. డిగ్రీ పూర్తి కాగానే ఇంట్లోని వారు ఆమెకు వివాహం చేసినప్పటికి తాను అనుకున్న లక్ష్యం కోసం శ్రమించింది. ఇద్దరు పిల్లలు ఉనప్పటికీ ఓ వైపు భర్త, పిల్లల యోగక్షేమాలు చూస్తూనే మరో వైపు ఇంట్లోనే ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఆమె కోచింగ్ సెంటర్లకు వెళ్లలేదు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయింది. 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోటీ పరీక్షలకు సిద్ధమై పరీక్షలను రాసింది. మొదట జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైంది. నారాయణఖేడ్ నాగల్గిద్దలో ఆమె మొదటి పోస్టింగ్ తీసుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే 2018లో వీఆర్వోగా ఎంపిక కావడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శికి రిజైన్ చేసి 2019 జూలైలో ఆర్సీపురం తహసీల్ కార్యాలయంలో వీఆర్వోగా బాధ్యతలు తీసుకుంది. వీఆర్వోగా పనిచేస్తున్న సమయంలోనే గ్రూప్-4 ఫలితాలు రావడంతో జూనియర్ అసిస్టెంట్కు ఎంపికైంది. వీఆర్వోగా రిజైన్ చేసి జనవరిలో సంగారెడ్డి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్గా ఆమె ఉద్యోగం నిర్వర్తిస్తున్నది. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురితో శభాష్ అనిపించుకుంటుంది.