రామచంద్రాపురం, ఏప్రిల్ 21 : గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఆర్సీపురం పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు. ఎస్సై శశికాంత్రెడ్డి తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన ప్రకాశ్ దుర్యోదన్ మోహితే, షేక్ అజ్మల్, మహ్మద్ హస్లమ్మోమిన్, షేక్ నవీద్ తూర్పుగోదావరి ఏజెన్సీలో సంజీవ్ అనే వ్యక్తి నుంచి 190 కేజీల గంజాయిని కొనుగోలు చేసి నాసిక్కు తరలిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారంతో రాజేందర్నగర్ ఎస్వోటీ పోలీసులు, ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా ఇక్రిశాట్ టోల్గేట్ వద్ద గంజాయిని తరలిస్తున్న రెండు కార్లను (ఎంహెచ్ 41ఏఎస్3077, ఎంహెచ్14డీఏ0865) తనిఖి చేయగా, 190 కేజీల గంజాయి దొరికింది. దీంతో పోలీసులు నలుగురిని పట్టుకొని, వారినుంచి గంజాయి, రెండు కార్లు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజా యి విలువ రూ.48 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.