మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రారంభోత్సవాల అనంతరం సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. నూతన భవనాలు, సభ ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. ముందుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశీలించారు.
అన్ని విభాగాలు తిరుగుతూ ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి పలు సూచనలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సభాస్థలి వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని సౌకర్యాలతో పాటు బందోబస్తుపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిలు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ సభకు భారీ జనసమీకరణ చేసి విజయవంతం చేయాలని కోరారు.