సిద్దిపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ రైలు ప్రారంభించడంతోపాటు, తిరుపతి, బెంగళూరు పట్టణాలకు రైళ్లు ప్రారంభించాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో రైల్వేబోర్డు చైర్పర్సన్, సీఈవో జయవర్మ సిన్హాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వినతిపత్రాన్ని అందించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ రైలు మార్గం చాలా ముఖ్యమైనదని, ఈప్రాంత ప్రజలు రైలు కోసం ఎదురుచూస్తున్నారని వివరించినట్లు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆమె సానుకూలంగా స్పందించి అక్టోబర్లో రైలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు.
రైల్ లైన్ పూర్తి చేసుకొని ట్రాయల్న్ నిర్వహించడంతోపాటుగా ఈనెల 15న రైల్వేసేఫ్టీ కమిషనర్ ఇన్స్పెక్షన్ పూర్తి చేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, ఆర్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేయడంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
దేశ చరిత్రలోనే అత్యంత త్వరితగతిన సిద్దిపేట రైల్వేలైన్ పూర్తి అయిందంటే రాష్ట్ర ప్రభుత్వం వేగం గా భూసేకరణ చేసి రైల్వేశాఖకు ఇవ్వడం వల్లే సాధ్యమైందన్నారు. రూ.2 50 కోట్లతో 2వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.315 కోట్లు నిధులు కూడా సమయానికి విడుదల చేయడం వల్ల సిద్దిపేట రైల్వేలైన్ సకాలంలో పూర్తయిం దన్నారు. సమైక్యరాష్ట్రంలో మిగిలిపోయిన వాటిని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్కోక్కటిగా అన్ని నెరవేర్చుతున్నా రని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.