రామాయంపేట, డిసెంబర్ 21 : కోడిగుడ్డును కొనలేకపోతున్నారు. బియ్యం, వంటనూనెలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. పచ్చిమిర్చి భగ్గుమంటున్నది. రోజురోజుకూ ఆకాశాన్నంటున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వంటింట్లోకి నిత్యావసరాలు కొనాలంటే మహిళలు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మునుపెన్నడూ లేనంతలా గుడ్ల ధరలు కొండెక్కాయి. అధిక పోషకాలు ఉండడంతో ప్రతి ఒక్కరూ గుడ్డుతో ప్రత్యేక వంటకాలు చేసుకుని మరీ తింటారు. కానీ ప్రస్తుతం గుడ్డు ధర రూ.4 నుంచి రూ.6కు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
త్వరలో పెండిండ్ల సీజన్ రానుండడంతో దొడ్డుబియ్యంతోపాటు సన్న బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్ సన్నబియ్యం ధర రూ.4వేలుండగా, ప్రస్తుతం రూ. 5వేలు పలుకుతున్నది. ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు మళ్లీ దొడ్డు బియ్యానికే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నారు.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. సామాన్యంగా ప్రతిరోజు ప్రతి కూరలో ఉల్లి వినియోగం ఉంటుంది. లేదంటే ఆ కూర రుచిగా ఉండదు. ఇది జగమెరిగిన సత్యం.నెల రోజుల క్రితం కిలో రూ.100 చేరి కంటతడిపెట్టించిన ఉల్లిగడ్డ ప్రస్తుతం రూ.25.రూ.30కి చేరింది. ధర ఆమాంతం తగ్గిపోవడంతో ప్రజలకు ఊరటలభించింది. తోపుడుబండ్లు, ఆటోలపై వ్యాపారస్తులు కిలో రూ. 10 చొప్పున విక్రయిస్తున్నారు.
వంటనూనెల ధరలు వారం రోజుల్లో కిలో నూనె రూ. 20కి పెరిగింది. గతంలో రూ.100 ఉండగా, నేడు రూ.120 నుంచి రూ.125 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభు త్వం నూనెగింజల రైతులను ఆదుకోవడం కోసం భారీగా ట్యాక్స్ని పెంచడంతో రిటైల్ మార్కెట్లో ఒక్కసారిగా ధరలు భగ్గుమంటున్నాయి. దిగుమతి సుంకాన్ని పెంచిన కారణాన్ని చూపిస్తూ వ్యాపారులు కిలోకు రూ.10 పెంచేశారు. దీంతో వం టింట్లో వంటల ఘుమఘుమలు ఆవిరైపోతున్నాయి.
కూరగాయలను కొనేందుకు గతంలో వారం వారం మార్కెట్కు వెళ్లేవాళ్లం. కానీ ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటుటుండడంతో మార్కెట్కు వెళ్లలేక పోతున్నాం. అక్కడ ఏది కొందామన్నా విపరీతమైన ధరలు ఉన్నాయి. అం దుకే పోవడం మానేశాం. గతంలో రూ. వంద తీసుకెళ్తే సంచి నిండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 3,4 రకాల కూరగాయలు తీసుకుందామన్నా రూ.250 అవుతున్నది.
ధరల పెరుగుదలపై ప్రభుత్వం పట్టించుకుంటేనే బాగుంటుంది. లేదంటే సామాన్యులు కూరగాయలు తినలేం. మార్కెట్లో ఏది కొందామన్నా వంటనూనెలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి చివరకు బియ్యం ధరలను కూడా వ్యాపారులు పెంచేసారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి.