మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 2: సమాజంలో అసమానతలు తొలిగించేందుకు రిజర్వేషన్లు ఉపయోగపడతాయని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మద్దూరు మండలం మర్మాములలో శుక్రవారం వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, మాజీ సర్పంచ్ సుందరగిరి శ్రవంతీపరశురాములుగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని గుర్తుచేశారు.
దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ దళితబంధు అమలు చేశారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఘట్కేసర్లోని నీలిమా దవాఖానలో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మద్దూరు, ధూళిమిట్ట మండల అధ్యక్షులు మేక సంతోష్కుమార్, మంద యాదగిరి, మాజీ సర్పంచ్లు చొప్పరి వరలక్ష్మీసాగర్, బొల్లు కృష్ణవేణీచంద్రమౌళి, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ జిలానీ, మాలమహానాడు సంఘం మండల అధ్యక్షుడు బొప్పె నాగయ్య, నాయకులు దామెర మల్లేశం, మంద సుమన్, గడిపె అనిల్కుమార్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.