అందోల్, మార్చి 21: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అందోల్ నియోజకవర్గం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరాయి పాలనకు చరమగీతం పాడి స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో అందోల్ రూపురేఖలు మారిపోతున్నాయి. స్థానికుడు.. ప్రజాసమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు క్రాంతికిరణ్ ఎమ్మెల్యేగా ఉండడంతో అందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. పట్ణణంలో ఎంతో చరిత్ర కలిగిన గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుని కూలిపోయేస్థితిలో ఉండగా, ఎమ్మెల్యే రూ. 65 లక్షలు మంజూరు చేసి కొత్త భవనం నిర్మించడంతో పాటు పాఠకులకు కావాల్సిన వసతులు సమకూర్చారు. క్లాక్టవర్కు మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకురాగా, రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మించి పచ్చని చెట్లు నాటించి వాటి మధ్యలో లైట్లు ఏర్పాటు చేయడంతో ఆ వెలుతురులో పట్టణం మెరిసిపోతున్నది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పూర్తి చేసి రైతులు, వ్యాపారుల ఇబ్బందులు తొలిగించనున్నారు. మనఊరు – మనబడిలో భాగంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించారు. పొలాల్లో పంటలు వేయాలంటే ఆకాశం వైపునకు ఆశగా ఎదురు చూస్తూ… పూర్తిగా వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులకు తాలెల్మ ఎత్తిపోతలతో భరోసా కల్పించారు. రూ.36.17 కోట్ల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించి రైతులకు అంకింతం చేయడంతో దశాబ్దాల కల నెరవేరి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా చెరువులు నిండి ఆయకట్టు పచ్చని పంటలతో దర్శనమిస్తున్నది. సింగూరు వరద కాలువలు నీటి సవ్వడులు చేస్తుండగా.. సింగూరు పరీవాహక ప్రాంతం కోనసీమను తలపిస్తున్నది. త్వరలో బసవేశ్వర-సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగునీరందనుండడంతో రైతులకు సాగునీటి కష్టాలు పూర్తిగా తొలిగిపోనున్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు మునిపల్లి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుండడంతో యువతకు స్థానికంగా పనిదొరకనున్నది. ఇందుకోసం భూ సేకరణ పూర్తికాగా, రైతులకు నష్టపరిహారం డబ్బులు సైతం అందజేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
ఇంటి ముంగిటకే తాగునీరు
ఒకప్పుడు గుక్కెడు నీళ్ల కోసం బిందెలు పట్టుకుని పరుగులు తీసిన పల్లె జనం.. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఇంటి ముంగిటకే నీళ్లు తీసుకొచ్చి దశాబ్దాలుగా మహిళలు పడుతున్న కష్టాలు తొలిగించారు. ఒక్కో మండలంలో 9 నుంచి 10వేల వరకు ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఒక్కో మండలానికి రూ.కోటి నుంచి రూ. రెండు కోట్ల వరకు ఖర్చు చేసి శుద్ధనీటిని సరఫరా చేస్తున్నారు.
ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట
జోగిపేట పట్టణంలోని 100 పడకల దవాఖానలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందుతున్నాయి. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, దవాఖానలో సమకూర్చాల్సిన వసతులపై ఆరా తీస్తున్నారు. ఇక్కడ అక్సిజన్ ప్లాంట్ సైతం ఏర్పాటు చేయగా, త్వరలో డయాలసిస్ కేంద్రం సైతం అందుబాటులోకి రానున్నది. డయాలసిస్ పనులు మొత్తం పూర్తికాగా, త్వరలో మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు.
అందోల్-జోగిపేట అభివృద్ధిలో జిగేల్
అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు రూ.4.కోట్ల 34లక్షలతో 49 పనులను ప్రతిపాదించగా 26 పనులు పూర్తయ్యాయి. రూ. 2.0 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ భవనం నిర్మాణంలో ఉన్నది. ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా రూ. 70 లక్షలతో 10 పనులు చేపట్టారు. పట్టణ ప్రగతిలో భాగంగా రూ.1.10 లక్షలతో మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. రూ. 1.6 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో ఆటోలు, ట్రాక్టర్లు, డ్రైనేజీ క్లీనర్ కొనుగోలు చేసి పారిశుధ్య పనులు చేపడుతున్నారు. టీఎఫ్ఐడీసీ ద్వారా మొదటి విడుతలో రూ. 9.60కోట్లు, రెండవ విడుతలో రూ. 9.70 కోట్లు నిధులు మంజూరు కాగా, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుబజారు నిర్మాణంతో రైతులు కష్టాలు తీరగా… రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మించి, చెట్లునాటి మధ్యలో వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో పట్టణం విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్నది. మినీ ట్యాంక్బండ్ నిర్మాణం, వాకింగ్ట్రాక్, ఓపెన్జిమ్, పిల్లలకు పార్కు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ప్రధాన రహదారి నిర్మాణం, రోడ్డుకు ఇరువైపులా సీసీ డ్రైనేజీ ఇలా అన్ని రకాల అభివృద్ధి జరుగగా, సీఎం ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేయడంతో పనులు జోరుగా సాగుతున్నాయి.
రూ. 250 కోట్లతో రోడ్లు, భవనాల నిర్మాణం
అందోల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఏ పనికి ఎంతమేర నిధులు అవసరమో గుర్తించి మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లను కలుస్తూ నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. విడుదలైన నిధులు ఏఏ పనులకు వినియోగించాలో అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో నాణ్యతగా, వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి ఇరకు వివిధ గ్రాంట్ల ద్వారా రూ.250 కోట్లు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల మరమ్మతులతో పాటు అవసరమున్న ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు నిర్మించడంపై ఎమ్మెల్యే దృష్టి సారించారు. అందోల్-జోగిపేట మున్సిపల్తో పాటు అందోల్, వట్పల్లి, మునిపల్లి, రాయికోడ్, పుల్కల్, చౌటకూర్ మండలాల్లో రోడ్లు, ఇతర భవంతుల నిర్మాణాలు పల్లెప్రతిలో భాగంగా అనేక పనులు చేపట్టి ప్రజలకు వసతులు కల్పించారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ అందోల్ నియోజకవర్గంలో జీపీలకు రూ. 10 లక్షల ప్రత్యేక నిధులు సైతం కేటాయించగా. అన్ని రకాల సౌలతులు సమకూరుతున్నాయి.
1350 మంది లబ్ధిదారులకు డబుల్ ఇండ్లు
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడురూమ్ పథకం ఎంతో మందికి నీడనిస్తున్నది. నియోజకవర్గంలో ఇండ్లు లేని 1350 మంది లబ్ధిదారులు సొంతింటివారయ్యారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీ, అందోల్, మునిపల్లి, పుల్కల్ మండలాల్లో 1350 డబుల్ ఇండ్లను నిర్మించగా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిచేశారు. పుల్కల్, మునిపల్లి మండలాల్లో ఇండ్లను అందజేయగా అందోల్, అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఇండ్లను మంత్రి హరీశ్రావు త్వరలో ప్రారంభించనున్నారు.
100 కుటుంబాల్లో దళితబంధు వెలుగులు
దళితబంధుతో నియోజకవర్గంలోని 100 దళిత కుటుంబాలు మొదటి విడుతలో లబ్ధిపొంది, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. టేక్మాల్ మండలం అసద్మహ్మద్పల్లి 50, వట్పల్లి మండలం బుడ్డాయిపల్లిలో 50 కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయగా చిన్నతరహా పాడి పరిశ్రమ, ట్రాక్టర్లు, జేసీబీలు, టెంట్హౌజ్లు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
25 రైతు వేదికలు
గతంలో రైతులు ఎలాంటి సమావేశాలు పెట్టాలన్నా ఇతర అంశాలు చర్చించాలన్నా చెట్టుకిందో లేదంటే ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటు చేసుకునేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన రైతుబిడ్డ సీఎం కేసీఆర్ రైతులందరూ ఒకే చోట చేరి మాట్లాడుకునేందుకు ఓ వేదిక ఉండాలనే సంకల్పంతో రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా క్లస్టర్ యూనిట్గా మండలానికి 5 చొప్పున మొత్తం 25 రైతు వేదికలు నిర్మించారు. ఒక్కో రైతువేదిక కోసం రూ. 5.0 లక్షలు కేటాయించగా నిర్మాణాలు పూర్తై ఇప్పుడూ అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
రూ. 3.80 కోట్లతో పంచాయతీ భవనాల నిర్మాణం
గ్రామాల్లో ఒక్కో పంచాయతీ భవనాన్ని రూ. 20లక్షలతో నిర్మించనున్నారు. నియోజకవర్గంలోని అందోల్ 3, చౌటకూర్ 6, మునిపల్లి 3, పుల్కల్ 1, రాయికోడ్ 3, వట్పల్లి 3 మొత్తం 19 కొత్త పంచాయతీ భవనాలు నిర్మించనుండగా, వాటి కోసం రూ. 3.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ భవనాలు పూర్తైతే పాలకవర్గం మొత్తం ఒకే చోట కూర్చుని గ్రామాభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించుకునే వీలుంటుంది.
గతుకుల రోడ్లకు మోక్షం
పదేండ్లుగా నియోజకవర్గంలోని అందోల్, వట్పల్లి, మునిపల్లి, పుల్కల్, చౌటకూర్, రాయికోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. దీంతో చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దుచేయగా ప్రైవేట్ వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మొదటి ప్రాధాన్యతగా రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టి మంత్రి సహకారంతో నిధులు రాబట్టారు. ప్రస్తుతం రోడ్ల పనులు జరుగుతుండగా, త్వరలో గతుకుల రోడ్లనుంచి ప్రజలకు మోక్షం లభించునున్నది.
పట్టణాలకు దీటుగా పల్లెలు
అందోల్ నియోజకవర్గంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఎంతో సహకరిస్తున్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేసి ప్రజలు నా మీదపెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న. అన్ని గ్రామాల్లో పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నాం. అవసరమైన చోట కొత్త రోడ్లు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. రైతుల కష్టాలు తొలిగించేందుకు తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించుకున్నాం. త్వరలో సంగమేశ్వర-బసవేశ్వరలను సైతం పూర్తి చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పూర్తైతే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తున్నా.
– క్రాంతికిరణ్, అందోల్ ఎమ్మెల్యే