సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: జాతీయ ఓటరు దినోత్సవాన్ని మెదక్,సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లలో వేడుకలు చేశారు. పలుచోట్ల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. అవగాహన సదస్సులు నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అధికారులు,ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిజ్ఞలు చేయించారు. ఉపన్యానం, వ్యాసరచన, పాటలు, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలు బహుమతులు ప్రదానం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్భయంగా ఓటేసే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నదన్నారు. ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిఒక్కరూ చైతన్యవంతులు కావాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు.
కొత్త ఓటర్లకు అభినందనలు
జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు కలెక్టర్ శుభాభినందనాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. నూతన ఓటర్లకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. సీనియర్ ఓటర్లను కలెక్టర్ సన్మానించారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. బీఎల్వోలు, తహసీల్దార్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు.
రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఓటు హక్కు
సంగారెడ్డి, జనవరి 25: రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఓటు హక్కు అని ఏఆర్ డీఎస్పీ జనార్దన్ అన్నా రు. బుధవారం జిల్లా కార్యాలయంలో సిబ్బందితో ఓటుహక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జలేందర్రెడ్డి, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, ఆర్ఐలు కృష్ణ, రామారావ్, డీపీవో సూపరింటెండెంట్ వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని జిల్లా కోర్టులో సామాజిక కర్యకర్త, న్యాయవాది మహమ్మద్ నిజామోద్దిన్ రషీద్, రజినీకాంత్ ఆధ్వర్యంలో ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు.
ఓటు ఎంతో విలువైనది…
మెదక్, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/మెదక్ మున్సిపాలిటీ: ఓటు హకును వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే అధికారం ఉంటుందని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మనదేశంలో భారత ఎన్నికల సంఘం అద్భుతంగా, సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తూ ఒకే రోజు ఫలితాలు వెల్లడిస్తున్నదన్నారు. జిల్లాలో స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టడంతో ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానంలో మంచి ఫలితాలు సాధించామని, రాష్ట్ర స్థాయిలో స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డికి స్పెషల్ క్యాటగిరి అవార్డు రావడం జిల్లాకు గర్వకారణమన్నా రు. ఉపన్యాసం, వ్యాసరచన, నాటక, పాటలు, చిత్రలేఖనం, ముగ్గుల పోటీల్లో విజేతలకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
ఓటు ఎంతో విలువైనది, శక్తివంతమైనది, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధం లాంటిది, ప్రతిఒక్కరూ నైతిక బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బుధవారం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా కేం ద్రంలోని రాందాస్ చౌరస్తా నుంచి ఆర్అండ్బీ అతిథి గృహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో రెండు వేల మంది విద్యార్థులు, ఆయా శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయిరామ్, డీఈవో రమేశ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, ఈడీఎం సందీప్, ఖనిజాభివృద్ధి శాఖ అధికారి జయరాజ్, ఆర్డీవో సాయిరామ్. నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రావు, డీఎస్పీ సైదులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నరేశ్, నవీన్ పాల్గొన్నారు.