గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపుకు ఆ గ్రామస్తులు కట్టుబడి ఉన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని నర్సన్నపేటలో నేటికీ మద్యం విక్రయాలు జరగవు. మద్యపాన నిషేధానికి 10 ఏండ్లు దాటింది. ఆ ఊరిలో పండుగ, పబ్బాలు జరిగినప్పుడు పక్క ప్రాంతాలకు వెళ్తే తప్పా ఆ గ్రామంలో మద్యం చుక్క దొరకదు. గ్రామంలో మద్యం నిషేధం ఉండడంతో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది.
మర్కూక్, ఏప్రిల్ 9: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని నర్సన్నపేట గ్రామాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి గ్రామ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఉపాధికి ఉపయోగపడుతున్న వనరులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడటంతో వారికి సాగునీటి సమస్య గుర్తించారు.
వెంటనే గ్రామం దగ్గరలోని కూడవెల్లి వాగుపై గ్రామ కమతాలకు సరిపడా ఒక పెద్ద చెక్డ్యామ్ నిర్మించారు. ఆర్థిక అవసరాలకు వ్యవసాయమే ప్రధాన కారణం. సం పాదించిన దాంట్లో మొత్తం కూడబెట్టుకోవాలని గ్రామస్తులు ఆలోచన చేశారు. మద్యానికి దూరంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని గ్రామస్తులకు తెలియజేసి ఊరిలో మద్యం అమ్మకాలు నిషేధించేలా ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి ఆ ఊరివాళ్లు కేసీఆర్కు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు.
మా ఊరిలో పదేండ్ల నుంచి మద్యం అమ్మడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాన్ని సందర్శించారు. మీరంతా బాగుండాలంటే, మీ కుటుంబాలు బాగుపడాలంటే ఎవరూ మద్యం తాగొద్దని చెప్పారు. దీంతో మద్యం విక్రయించరాదని, మద్యం అమ్మరాదని నిర్ణయం తీసుకున్నాం. గ్రామంలో ఎవరూ మద్యం తాగడం లేదు.
– గిలక బాల్నర్సయ్య, నర్సన్నపేట సర్పంచ్, మర్కూక్ మండలం (సిద్దిపేట జిల్లా)
కేసీఆర్ సారు మా ఊరును దత్తత తీసుకున్నప్పుడు ఊరిలో అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతకు ముందు ఊర్లో గల్లీగల్ల్లీకీ బెల్టుషాపు ఉండేది. పొద్దంతా తాగి సంసారాలు పాడు జేసుకున్నారు. కొంత మందైతే తాగుడుకు బానిలై సచ్చిపోయిర్రు. ఇప్పుడు ఆబాధలేదు. బతుకులు మారినాయి. కేసీఆర్కు ఇచ్చినమాట మీద నిలబడ్డ మా ఊరు ఆదర్శంగా మారింది.
– బూకల స్వప్న, నర్సన్నపేట గ్రామం, మర్కూక్ మండలం (సిద్దిపేట జిల్లా)