జిన్నారం (పటాన్చెరు), ఫిబ్రవరి 4: కాంగ్రెస్ ప్రభుత్వంలో బతకలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే కు హరీశ్రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పటాన్చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, సునీతారెడ్డితో కలిసి ఆయన వస్తుండగా పటాన్చెరు బస్స్టాప్ వద్ద రోడ్డుపై ఉన్న ఆటోడ్రైవర్లను చూసి కారు ఆపి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించ డం వల్ల తమ రోజువారి జీవనం కష్టమైందని, ఆత్మహత్యలు చేసుకునే దుర్భర పరిస్థితులు వచ్చాయని ఆటో డ్రైవర్లు హరీశ్రావుకు తెలిపారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతామని ఆటోడ్రైవర్లకు భరోసా ఇచ్చి ధైర్యం కల్పించారు.