అధికారం లేని కిందిస్థాయి అధికారులను మీటింగ్కు పంపొద్దు
పెండింగ్లోఉన్న దరఖాస్తులను పరిష్కరించాలి
వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్డేట్ చేయాలి
మెదక్ కలెక్టర్ హరీశ్
44 విజ్ఞప్తులు అందజేసిన అర్జీదారులు
సంగారెడ్డిలో 55 దరఖాస్తులు స్వీకరించిన
అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి
మెదక్, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని, గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారులకు సమస్యలు విన్నవిస్తే పరిష్కారమవుతాయనే నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారు లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. లేకుంటే ప్రాధాన్యత సన్నగిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల తాజా పరిస్థితిని సమీక్షిస్తూ 52 శాఖల్లో 172 దరఖాస్తులతో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో 61, మండల తహసీల్దార్ల స్థాయిలో 152, మండల పరిషత్ స్థాయిలో 115 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
లేని పక్షంలో వారికి సరైన పరిష్కార మార్గం చూపుతూ వివరాలను ప్రజావాణి వెబ్సైట్లో అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. అప్డేట్ చేయడంలో ఏమైనా ఇబ్బందులుంటే 7337340816 మొబైల్ నంబర్కు సంప్రదించాల్సిందిగా అధికారులకు సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో 44 విజ్ఞప్తులు అందాయన్నారు. అందులో ప్రధానంగా భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూ నష్టపరిహారం తదితర సమస్యలకు సంబంధించి 26 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పింఛన్లకు సంబంధించి 3 విజ్ఞప్తులు, వివిధ అంశాలకు సంబంధించి మరో 15 దరఖాస్తులు వచ్చాయి. వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత శాఖలకు అందజేస్తూ నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, మైన్స్ ఏడీ జయరాజ్, డీపీవో తరుణ్కుమార్, డీఆర్డీవో శ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్ట్స్ ఏడీ గంగయ్య, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి, డీఎస్డీవో విజయలక్ష్మి, బీసీ అధికారి కేశూరం, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, కలెక్టరేట్ ఏవో మన్నన్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.