దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేస్తుండడంతో లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకుంటూ విజయపథంలో ముందుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదటి విడుత విజయవంతం కావడంతో రెండో విడుతను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. మంత్రి హరీశ్రావు సూచనల మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 1100 మంది చొప్పున సంగారెడ్డి జిల్లాలో 5500 మందిని ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.550 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించింది. మెదక్ జిల్లాలో సుమారు 3వేల నుంచి 3500 మందికి ‘దళితబంధు’ అందించాలని నిర్ణయించగా, రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నది. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించి పారదర్శకంగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మొదటి విడుతలో సాయం పొందిన లబ్ధిదారులు వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకుని సమాజంలో ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు.
– సంగారెడ్డి/మెదక్, (నమస్తే తెలంగాణ), జూలై 7
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలను నిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో అట్టడుగు వర్గాలు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే అర్హులు అందుకున్న రూ.10 లక్షలతో వివిధ యూనిట్లు స్థాపించి పురోభివృద్ధి చెందుతున్నారు. మరోమారు ఈ పథకాన్ని రెండో విడతగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సంగారెడ్డి/ మెదక్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తూ రూ.10 లక్షలతో వివిధ యూనిట్లను వారికి అందజేసి, పురోభివృద్ధికి బాటలు వేశారు. మొదటి విడత విజయవంతం కావడంతో ప్రస్తుతం రెండో విడతకు సన్నద్ధమవుతున్నారు. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 444 మందికి, మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలతో పాటు గజ్వేల్, అందోల్, దుబ్బాక, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి కలిసిన మండలాల పరిధిలోని 256 మందికి ఈ పథకం వర్తింపజేశారు. రెండో విడతలో సంగారెడ్డి జిల్లాలో 5500 మందికి, మెదక్ జిల్లాలో సుమారు 3వేల నుంచి 3500 మందికి దళితబందు పథకాన్ని ప్రభుత్వం అందజేయనున్నది. ఉమ్మడి జిల్లా మంత్రి హరీశ్రావు సూచనల మేరకు పథకం అమలుకు అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేసింది.
సంగారెడ్డి జిల్లాలో రెండో విడతకు సన్నద్ధం
ప్రభుత్వ ఆదేశాల మేరకు దళితబంధు రెండో విడత అమలుకు అధికార యంత్రాంగంసన్నద్ధమవుతున్నది. ఇందుకోసం జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 5500 మందికి దళితబంధు పథకం వర్తింపజేయనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా, ప్రభుత్వం రూ.550 కోట్లను జిల్లాకు కేటాయించింది. జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రెండో విడత దళితబంధు పథకం అమలుపై దృష్టి పెట్టారు. దళితులు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి దరఖాస్తులను అందజేస్తున్నారు. పథకం అమలుకు సంగారెడ్డి కలెక్టర్ శరత్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. సంగారెడ్డి నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా పరిశ్రమలశాఖ అధికారి ప్రశాంత్కుమార్, పటాన్చెరు నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా డీఆర్డీవో శ్రీనివాస్, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా డీపీవో సురేశ్ మోహన్, అందోలు నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా జడ్పీ సీఈవో ఎల్లయ్య, జహీరాబాద్ నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా డీఆర్డీఏ అదనపు పీడీ జయదేవ్ను నియమించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
మెదక్ జిల్లాలో ఇలా..
దళితబంధు రెండో విడత ప్రక్రియ మెదక్ జిల్లాలో ప్రారంభించారు. మెదక్ నియోజకవర్గంలో 1100 మందిని, నర్సాపూర్ నియోజకవర్గంలో 1100 మందిని ఎంపిక చేయనున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగి మండలాల్లో 200 నుంచి 300 వరకు, గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, తూప్రాన్ అర్బన్, మనోహరాబాద్ మండలాల్లో 300 నుంచి 400 మందిని, అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల్లో 300 నుంచి 400 మందిని, నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేటలో 100 నుంచి 200 మందిని ఎంపిక చేయనున్నారు.
అందుబాటులోకి ప్రత్యేక యాప్..
దళితబంధు లబ్ధిదారుల వివరాలు, వారు నిర్వహిస్తున్న యూనిట్లను పొందుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు నమోదు చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వారు యూనిట్ ద్వారా లబ్ధిదారులు నెలనెలా పొందుతున్న ఆదాయ వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా ఇచ్చిన యూనిట్ ఏమిటి? అది ఎకడ పనిచేస్తుంది? నెలనెలా వస్తున్న ఆదాయం ఎంత? అనే సమ్రగ సమాచారం యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు.
మొదటి విడత విజయవంతం..
సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత దళితబంధు పథకంలో 444 మంది లబ్ధి చేకూరింది. సంగారెడ్డి నియోజకవర్గంలో 100 మంది, పటాన్చెరులో 100, నారాయణఖేడ్లో 100, జహీరాబాద్లో 100, అందోల్లో 44 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకంను వర్తింపజేశారు. మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్, అందోల్, దుబ్బాక, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి కలిసిన ఆయా మండలాల పరిధిలో 256 మంది దళితబంధు యూనిట్లు పొందారు. మెదక్ నియోజకవర్గంలో 100, నర్సాపూర్ నియోజకవర్గంలో 100, అందోల్ నియోజకవర్గంలోని హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. రూ.10 లక్షలతో దళితబంధు లబ్ధిదారులు తాము ఎంపిక చేసుకున్న వ్యాపారాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. డెయిరీ ఫామ్లు, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు, డీలర్షాపులు, సెంట్రింగ్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. జేసీబీ, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర ట్రాన్స్పోర్టు వాహనాలను కొనుగోలు చేశారు. మహిళలు బ్యూటీపార్లర్లు, క్లాత్సెంటర్లను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా నడుపుతున్నారు.
దళితబంధు అద్భుతమైన పథకం
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు అద్భుతమైన పథకం. దళితుల ఆర్థిక పురోభివృద్ధికి ఈ పథకం బాటలు వేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో రెండో విడత దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సంగారెడ్డి నియోజకవర్గంలో మొదటి విడతలో 100 మందికి పథకం వర్తింపజేయగా, రెండో విడతలో నియోజకవర్గంలోని 1100 మంది లబ్ధి పొందనున్నారు.
– చింతా ప్రభాకర్, చేనేత అభివృద్ధి సంస్థచైర్మన్
రెండో విడతలో మరింత మందికి..
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకం అమలు చేస్తున్నారు. అందోలు నియోజకవర్గంలో మొదటి విడతలో 100 మందికి దళితబంధు పథకం వర్తింపజేశాం. రెండో విడతలో 1100 మందికి దళితబంధు పథకం ద్వారా లబ్ధిచేకూరనున్నది. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఎంపికైన లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకోవచ్చు.
– చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే అందోలు
త్వరలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం..
దళిత బంధు రెండో విడత ఎంపిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తాం. రెండో విడతలో మెదక్ జిల్లాకు 3వేల నుంచి 3500 వరకు యూనిట్లు వచ్చే అవకాశమున్నది. మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సహకారంతో దళితబంధు రెండో విడత ప్రక్రియను కొనసాగిస్తున్నాం. మొదటి విడతలో 256 మందికి యూనిట్లను అందజేశాం. విజయవంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. రెండో విడతలో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది.
– విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ