వెల్దుర్తి, ఫిబ్రవరి 8: మెదక్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. గురువారం మాసాయిపేట, వెల్దుర్తి మండలాల పరిధిలోని హాకీంపేట, ఉప్పులింగాపూర్ గ్రామాల్లో సాగు చేస్తున్న ఆయిల్పామ్ తోటలను అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పంట సాగవుతుంది, రాయితీ ఎంత, ఎంతమంది సాగు చేస్తున్నారు, పరిశ్రమ ఏర్పాటు పనులతో పాటు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్పామ్ తోటల్లో తిరిగి మొక్కలు, అంతర పంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఐదువేల ఎకరాల్లో సాగు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 300 ఎకరాల్లో సాగు అవుతుందని, మార్చి నాటికి మరో 500 ఎకరాల్లో పంట వేయనున్నట్లు వివరించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సన్న, చిన్నకారు రైతులకు ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలని, మరింత మంది ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో లివింగ్ ఫుడ్ అనే పరిశ్రమతో కలిసి పనిచేస్తున్నామని, పరిశ్రమ వారు మొక్కలను ఇవ్వడమే కాకుండా పంటను కొనుగోలు చేస్తారన్నారని, సాగును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు అండగా నిలుస్తారని తెలిపారు.
హార్టికల్చర్ జిల్లా అధికారి నరసయ్య మాట్లాడుతూ ఎకరా విస్తీర్ణంలో 57 మొక్కలు, మొక్కకు, మొక్కకు మధ్య తొమ్మిది మీటర్ల దూరంతో పంటను వేసుకోవాలన్నారు. ఒక్కో మొక్కకు రూ. 20 చొప్పున రూ. 1140 చెల్లించాలని, డ్రిప్నకు ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం రాయితీ కాగా, ఇతరులకు 90 శాతం రాయితీ ఉంటుందన్నారు. మొత్తంగా ఎకరం సాగుకు ప్రభు త్వం రూ. 50వేల రాయితీ ఇస్తుందని, ఇందులో డ్రిప్నకు రూ. 22,518, మొక్కలకు రూ.11,600, సంవత్సరానికి రూ. 4,200 చొప్పున నాలుగు సంవత్సరాలకు రూ. 16,800లను ఎరువులు, సాగు ఖర్చుల కోసం అందిస్తుందన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఐదో ఏట నుంచి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత హార్టికల్చర్, వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, నర్సాపూర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి రామకృష్ణ, లివింగ్ ఫుడ్ పరిశ్రమ ప్రతినిధి కృష్ణ, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఆర్ఐ ధన్సింగ్, ఎంపీడీవో వెంకటలక్షమ్మ, ఏవో రాజశేఖర్తో పాటు పలువురు అధికారులు, రైతులు ఉన్నారు.