సంగారెడ్డి, జనవరి 19: సంగారెడ్డి జిల్లాలోని అక్రమ మైనింగ్ ప్రాంతాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పలు చోట్ల ప్రభుత్వ భూములు, నీటి వనరులు కబ్జాకు గురివుతున్నాయని, వాటిని పరిరక్షించాలని ఆదేశించారు. కలెకర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి భూకబ్జాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. అక్రమ మైనింగ్లపై నమోదు చేసిన కేసులను 15 రోజుల్లోగా అందించాలని ఏడీని ఆదేశించారు
జిల్లాలో బెల్ట్షాపులు ఉండొద్దని, అన్నింటినీ మూసేయించాలన్నారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లోని సమస్యలు పరిష్కరించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వసతులు, సిబ్బంది, భవనాల వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన, చక్కెర, పౌరసరఫరాలు, వైద్యారోగ్య, పశుసంవర్దక, మత్స్య, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ శాఖలపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేశ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్డీవో, ఆర్డీవోలు పాల్గొన్నారు.