సిద్దిపేట, సెప్టెంబర్ 7 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): “కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా, సీఎం కేసీఆర్ దయతో చెరువులు నిండుగా ఉన్నాయి. ఇవ్వాళ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని’ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలం రాజగోపాల్పేట గంగమ్మగుడిలో బుధవారం ప్రత్యేక పూజలు చేసి అనంతరం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వందశాతం సబ్సిడీపై గ్రామ ఊర , పెద్ద చెరువుల్లో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన చేపపిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాజగోపాల్ పేట పెద్ద చెరువు కింద 250 మంది సభ్యులు ఉన్నారన్నారు.
80 నుంచి 100 ఎంఎం సైజు గల లక్షా 20వేల చేప పిల్లలను ఉచితంగా వేస్తున్నామని తెలిపారు. చేప పిల్లల ఖరీదు రూ1,67,160 అని తెలిపారు. ఈ చెరువులో ఉత్పత్తి అయిన చేపలను మార్కెటింగ్ చేసేందుకు 31 ద్విచక్రవాహనాలు, రెండు లగేజీ ఆటోలను సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద అందించినట్లు తెలిపారు. జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక, తోటపల్లి, తపాస్పల్లి రిజర్వాయర్లతో పాటు 235 మత్స్యశాఖ చెరువులు ఉన్నాయన్నారు. 1390 చెరువులు, కుంటలు ఉన్నాయని, వాటన్నింటిలో చేపపిల్లలను వదలడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 4.09 కోట్ల చేప పిల్లలను వదలడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వం మత్స్యకారులకు చేపల మార్కెటింగ్, రవాణా చేసేందుకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 75 శాతం రాయితీపై రూ. 18.17 కోట్లు మత్స్యకారుల సంక్షేమం కోసం ఖర్చుచేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 3,711 యూనిట్లు ఇచ్చామన్నారు. 28 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు రూ.88 లక్షల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రమాద బీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తు మత్స్యపారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలను రాజగోపాల్పేట చెరువులో ముంచాలి
కాళేశ్వరం ప్రాజెక్టు,రాష్ట్రంలో కరెంట్ సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను రాజగోపాల్పేట చెరువులో ముంచాలని మంత్రి హరీశ్రావు అన్నారు. భారతదేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడేనన్నారు. ఎవుసానికి గతంలో నీళ్లు లేక ఇబ్బంది అయ్యేదన్నారు. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండటంతో కూలీలు దొరకడం లేదని, బీహార్ నుంచి కూలీలు వచ్చి వరి నాట్లు వేస్తున్నారన్నారు. ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవన్నారు. ఇవాళ ఆ రోజులు మారిపోయి సీన్ రివర్స్ అయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కనపడడం లేదా అని ఎద్దేవా చేశారు. ఆ కనపడని కాంగ్రెస్, బీజేపీ నాయకులను పేట చెరువులో ముంచాలన్నారు. బీడీలు వద్దని, కాంగ్రెస్ పుర్రె గుర్తు, బీజేపీ 28 శాతం జీఎస్టీ పెట్టిందని, దేశంలోనే తెలంగాణలోనే బీడీ కార్మికులకు రూ.2016 పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు మన సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లేశం, సర్పంచ్ ఎల్ల రాజేంద్ర, ఎంపీటీసీ సుమలతాచందు, సర్పంచ్ కమలాకర్రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ను దీవించండి
నంగునూరు, సెప్టెంబర్ 7: ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో నీళ్ల కోసం చాలా కష్టం ఉండేది. సీఎం కేసీఆర్ అపర భగీరథుడు.. గోదావరి నీళ్లు మనకు వచ్చాయి. మీరంతా సీఎం కేసీఆర్సారుకు చల్లని దీవెనలు ఇవ్వాలని కోరారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో బుధవారం 1,117 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని 16 రాష్ర్టాల్లో ఢిల్లీ బీజేపీ డబుల్ ఇంజిన్ అంటున్నారని, ఎక్కడైనా రూ.2 వేల పింఛన్, 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా..? ఇస్తే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇచ్చిన మాట ప్రకారం రూ.1000 పింఛన్ను రూ.2016 పెంచి పేదలకు అందిస్తున్నారని గుర్తుచేశారు. నంగునూరు మండలంలో గతంలో 6975 పింఛన్లు ఉండేవని, కొత్తగా 1117 మంది కి పింఛన్లు ఇచ్చామన్నారు.