మర్కూక్, డిసెంబర్ 1 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మకు గంగమ్మ తరలిరాగా, రైతాంగానికి ఈయేడు యాసంగి పంట సాగుకు ఢోకాలేకుండా పోయింది. దీంతో దండిగా పంటలు పండుతున్నాయి. లక్షల ఎకరాలకు సరిపడే సాగునీటిని అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ను నిర్మించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్కు 9 టీఎంసీల వరకు నింపగా, తాజాగా, ఈ సంఖ్య 12 టీఎంసీల వరకు చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇంతపెద్ద స్థాయిలో నీటిని నింపడం ఇదే ప్రథమం. తాజాగా చేరిన గోదావరి జలాలతో ఉమ్మడి నల్లగొండ, మెదక్ జిల్లాలోని 2లక్షల 85వేల ఎకరాలకు సరిపడా సాగునీరును అందించాలన్నది ఈయేడు లక్ష్యంగా నిర్ధారించుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
రైతు కండ్లల్లో ఆనందం
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి అటుఇటుగా నిండింది. ప్రాజెక్టు పరసర ప్రాంతాల రైతులు ఎడకార్తి(చింతపుకార్తి), యాసంగి, వానకాలం కలుపుకొని మూడు పంటలు వేసుకున్నా తరిగిపోని నీటిసంపద చెంతకు చేరినైట్లెంది. గతంలో కేవలం వానదేవుడు కరుణిస్తేనే నాలుగు గింజలు పండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన ఈ జలభాండాగారంతో ఏడాది పొడవునా ఎవుసం చేసేటోళ్లకు పండుగలా మారింది. గతంలో అప్పోసప్పో చేసి బోర్లు వేసుకుంటే, కాస్తోకూస్తో నీళ్లు పడ్డా రైతులు కొద్దిమందైతే.. చుక్కా నీటిబొట్టు పడనివాళ్లు కోకొల్లలు. కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణ పుణ్యమా అని నేడు ప్రతీరైతు కండ్లలో సాగుభరోసా కనిపిస్తుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వేసిన బోర్లల్లో మోటర్వేస్తే పైపునిండా నీళ్లే వస్తుండటంతో ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం పరుచుకున్నది.
తీరిన కరువు కాటకాలు
గతంలో మట్టిదుమ్మురేగిన నేలలుమావి. సమృద్ధిగా వానలు పడితే తప్పా రెండు పంటలు ఎప్పుడూ పండలేదు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో ఆ బాధలు తెలిసి, రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, పండించిన పంటలకు సరైన మద్దతు ధర ఇస్తుండటంతో రైతురాజ్యం వచ్చినైట్లెంది. సర్కారు తుమ్మలు పెరిగిన జాగాలో ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయంటే దానికి ముఖ్యమంత్రి చేసిన కృషినే ప్రధాన కారణం.
– మంగమ్మారామచంద్రం, జడ్పీటీసీ, మర్కూక్
పెరిగిన ధాన్యం ఉత్పత్తి
ప్రాజెక్టు నిర్మించకముందు మండలం లో ఏడాదికి సరాసరి 2వేల ఎకరాల్లోనే వరిసాగు అయ్యేది. పెద్దమొత్తంలో కూరగాయల సాగుపైనే ఆధారపడేవారు. మర్కూక్ మండలాన్ని మొత్తం 3క్లస్టర్లుగా విభజించాం. ప్రతీ క్లస్టర్లో గతంలో ఉన్న 2వేల ఎకరాల నుంచి 6వేల ఎకరాల వరకు వరిసాగు పెరిగింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరగనున్నది. కూరగాయల సాగు సైతం మూడింతలైంది. దీనంతటికి కారణం ప్రాజెక్టు నిర్మాణం. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న వివిధ రకాల సదుపాయాలు.
– డాక్టర్ నాగేందర్రెడ్డి, వ్యవసాయ అధికారి, మర్కూక్