దుబ్బాక, ఏప్రిల్ 3: మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మెదక్ గడ్డ ఎప్పటికీ బీఆర్ఎస్ అడ్డ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదన్నారు. రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అనేక హామీలు ఇచ్చి ఒక్కటి సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాజకీయ కక్ష సాధింపుతో సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. కూడవెల్లి వాగులోకి నీరు విడుదల చేయాలని ఎన్నోసార్లు మంత్రులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, పంటలు పండిపోయిన తర్వాత నీరు విడుదల చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అని సీఎం తీరును కొత్త ప్రభాకర్రెడ్డి దుయ్యబట్టారు. అవకాశ రాజకీయ నాయకులను నమ్మి మోసపోవద్దని, నిస్వార్థంతో పనిచేసే నాయకులకు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. తుపాకీ రాముడి మాదిరిగా గత ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి, గ్లోబెల్స్ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
దుబ్బాకలో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లుగా బీజేపీ అభ్యర్థి రఘునందన్కు మాటలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు రఘునందన్కు కర్రుకాల్చి వాత పెట్టారని, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డికి డిపాజిట్ రాకుండా భూస్థాపితం చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో అదే పరాజయం తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎంపీగా ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. మెదక్, సిద్దిపేటకు రైలు , సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయం, నేషనల్ హైవే రోడ్డు, ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్డు, నర్సాపూర్-బాలానగర్ నేషనల్ హైవే రోడ్డు , సంగారెడ్డిలోని కొండాపూర్లో ఫస్ట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, బోయిన్పల్లి నుంచి రామాయంపేట వరకు నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, తూప్రాన్ వద్ద, చేగుంట వద్ద వంతెనలు నిర్మించానని తెలిపారు. ఇటీవల చేగుంట-మెదక్ రోడ్డులో వంతెన మంజూరు చేయించానన్నారు. 18 రైల్వే అండర్ పాసులు మంజూరు చేయించానని, మెదక్ రైలును జోగిపేట మీదుగా పటాన్చెరు, సంగారెడ్డి వరకు రైల్వేలైన్కు రూ.1700 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. బీజేపీ ఎంపీలు సైతం చేయని అభివృద్ధి పనులు తాను చేసినట్లు కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, హ్యాట్రిక్ సాధించుకుందామని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారిగా పనిచేశానని, సిద్దిపేట కలెక్టర్గా, ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జేసీగా పనిచేసి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. తనకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించే సత్తా కూడా ఉందన్నారు. తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్లో ఎంపీగా గళం వినిపించి, ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పేదల కోసం తమ సొంత డబ్బులు రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతి, పేద విద్యార్థులకు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ తదితర వాటికే వినియోగిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచిన నెల రోజుల్లో ట్రస్టు ఏర్పాటు చేస్తానన్నారు. సమావేశంలో దుబ్బాక జడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టే రాజమౌళి, నాయకులు ఎల్లారెడ్డి, భూంరెడ్డి, కిషన్రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, ఆస స్వామి, మూర్తి శ్రీనివాస్రెడ్డి, రొట్టే రమేశ్, చంద్రయ్య, రాంరెడ్డి, యువజన నాయకులు సురేశ్, మహేశ్, దేవరాజ్ పాల్గొన్నారు.