Narsapur | నర్సాపూర్, మే 6 : జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట్ గ్రామానికి చెందిన హోమియోపతి వైద్యుడు దండెపు బస్వానందం చనిపోయిన తన తల్లిదండ్రులు దండెపు ఈశ్వరప్ప(1985), పెంటమ్మల(2006)కు అతడి వ్యవసాయ పొలంలోనే గుడిని కట్టించాడు. తనకున్న రెండు గుంటల భూమిలో గుడి నిర్మాణం చేపట్టాడు. స్వర్గస్తులైన తల్లిదండ్రుల విగ్రహాలను మార్బుల్ రాయితో తయారుచేయించాడు.
ఈశ్వరప్ప, పెంటమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలో రెండవ కొడుకు డాక్టర్ దండెపు బస్వానందం తన తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి తనను డాక్టర్ చదివించారని, వ్యవసాయం చేస్తూ కష్టపడిన అదే భూమిలో వారికి గుడి నిర్మాణం చేశానని తెలిపారు. తమ పొలంలో వాగు ఉండేదని, ఆరుగాలం కష్టించి పండించిన పంటలు వరదలొచ్చినప్పుడు కొట్టుకుపోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలోని ఊట బావి నుంచి మోట కొట్టి పంటకు సాగునీరు అందించేవారని వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన విగ్రహాల ప్రతిష్ఠాపన, గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని, జన్మనిచ్చి తనను ఇంత వాడిని చేసిన తల్లిదండ్రులకు గుడి కట్టించి వారి రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు.