అయిజ, ఆగస్టు 12 : ఏపీలోని రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పురంలో ప్రియాంక కుటుంబ సభ్యులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. ప్రియాంక చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ప్రియాంక తండ్రి వెంకటేశ్తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు.
మెడికో ప్రియాంక మృతి బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి వైద్యసేవలు అందించనున్న తరుణంలో డాక్టర్ మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తండ్రి న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ సలహాలు, సూచనలు చేస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్ కుటుంబానికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. నిందితులు ఎంతటి వారైనా ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా ఏపీ సర్కార్పై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ఘటనకు కారణమైన వారికి శిక్ష పడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మృతి చెందిన ప్రియాంక కుటుంబానికి ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు చెరో రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు.