శివ్వంపేట, మే 9 : ప్రభుత్వం మహిళల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం శివ్వంపేట పీహెచ్సీలోని ఆరోగ్య మహిళా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. దవాఖానలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి ఏర్పాటు చేసిన మహిళా కేంద్రాలపై ఏపీఎంలు, మహిళా సంఘాలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 6 కేంద్రాలను మహిళలు చక్కగా వినియోగించుకుంటున్నారని తెలిపారు.
18 ఏండ్ల పైబడిన ప్రతి మహిళకు 8 రకాల వ్యాధులపై అవగాహన కలిగించి, వారిలో ఉన్న సమస్యలను ముందే గుర్తించి ఈ కేంద్రానికి తీసుకువచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని, జిల్లా కేంద్రానికి రెఫర్ చేసిన కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి ఫాలోప్ చేయాలని కలెక్టర్ వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,852 మంది మహిళలు రిజిస్టర్ కాగా, 1,456 మంది నుంచి శాంపుల్స్ సేకరించి డయాగ్నాస్టిక్ పరీక్షలకు తరలించామన్నారు. త్వరలో జిల్లాలో మరో 8 ప్రాంతాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన సిబ్బంది హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు సాయిసౌమ్య, సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాసచారి, ఆర్ఐ కిషన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.