సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 13: జిల్లాలో గుడుంబా, గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సరఫరా, వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి.అనురాధతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ పరివర్తన’ కార్యక్రమం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, నిరోధానికి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్కు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాదకద్రవ్యాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కలిసి యాంటీ డ్రగ్ కమిటీలుగా ఏర్పడాలన్నారు.
ఈ కమిటీలు డ్రగ్స్ సరఫరా నియంత్రణపై దృష్టి పెట్టడంతో పాటు అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకున్నట్లు, సరఫరా చేసినట్లు తెలిస్తే వెంటనే ఈ కమిటీలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీపీ అనురాధ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరా చాలా తక్కువగానే ఉందని, ఇప్పటినుంచే పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో గంజాయి రవాణా జరుగుతున్నట్లు వినిపిస్తుందని, దాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. అనంతరం డ్రగ్ ఈజ్ బగ్, సే గుడ్ బై డ్రగ్స్ గోడ పత్రికలను కలెక్టర్, సీపీ ఆవిష్కరించారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, డీఎఫ్వో శ్రీనివాస్, డీడబ్ల్యూవో రామ్గోపాల్రెడ్డి, డీఈవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.