గుమ్మడిదల, ఫిబ్రవరి12: లక్ష రూపాయలకు కన్న కొడుకును విక్రయించిన మహారాష్ట్ర వాసి ఆశిక్ తులసీరామ్ హట్వార్పై గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేశారు. గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్రెడ్డి వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఆశిక్ తులసీరామ్ హట్వార్, మాధురి ఇకర్ దంపతులు దోమడుగులో నివసిస్తున్నారు. వీరికి రెండేండ్ల కుమారుడు నాక్ష్ ఉన్నారు.
ఆశిక్ తులిసీరామ్ హట్వార్ తన రెండేండ్ల కుమారుడు నాక్ష్ను అల్లాదుర్గం, గడిపెద్దాపూర్ గ్రామాలకు చెందిన శేరివిఠల్, రాజేశ్వరి సహకారంతో నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన ముస్తిస్వామి, కల్పనకు విక్రయించారు. ఈ దంపతులు ప్రస్తుతం దోమడుగులో నివాసం ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన మాధురి ఇకర్ ఫిర్యాదుతో సోమవారం గుమ్మిడిదల పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. బాలల సంరక్షణ అధికారులు చిన్నారి నాక్ష్ను తల్లికి అప్పగించారు.