జూన్లో రైతుబంధు అందించేందుకు అధికారుల సన్నాహాలు
కొత్తగా పట్టాపాస్ బుక్కు వచ్చిన రైతులు
ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఎనిమిది విడతల్లో 59,12,281 మంది రైతులకు
రూ. 6,179 కోట్ల 25 లక్షలు జమ
జూన్లో రైతుబంధు పంపిణీకి అధికారుల సన్నాహాలు
సిద్దిపేట జిల్లాలో 20,08,784 మంది రైతులకు రూ.2,193 కోట్లు
మెదక్ జిల్లాలో 17,26,509 మంది రైతులకు రూ. 1,450 కోట్లు
సంగారెడ్డి జిల్లాలో 21,76,988 మంది రైతులకు రూ.2,535 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆదుకుంటున్నది. వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతకు జూన్లో రైతుబంధు అందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు (గత యాసంగిని కలుపుకొని) ఎనిమిది విడతలుగా సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించారు. ప్రస్తుతం వానకాలం పంటకు అందించే పెట్టుబడి సాయం తొమ్మిదో విడత. గత ఎనిమిది విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 59,12,281 మంది రైతులకు రూ.6,179 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఈ వానకాలానికి జిల్లాలో కొత్తగా అర్హులైన రైతుల జాబితాను తయారుచేసే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో రైతుబంధు పడిన రైతులకు అదే ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానున్నది. ఈసారి బ్యాంకు ఖాతాల మార్పులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
సిద్దిపేట, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాగు కు సమాయత్తం అవుతున్న అన్నదాతకు జూన్ మొదటి వారంలో రైతు బంధు అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.సీఎం కేసీఆర్ ప్రతి పంటకు పెట్టుబడి సాయం కింద రైతు బంధును అందిస్తున్నారు. ఇప్పటి వరకు (గత యాసంగిని కలుపుకొని) ఎనిమిది పంటలకు పెట్టుబడి సాయం అందించారు. ప్రస్తుత (ఖరీఫ్)వానకాలం పం టకు అందించే పెట్టుబడి సాయం తొమ్మిదవది. గత ఎనిమిది విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 59,12,281 మంది రైతులకు రూ.6,179 కోట్ల 25 లక్షల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.సిద్దిపేట జిల్లాలో 20,08,784 మంది రైతులకు రూ. 2193 కోట్ల 41లక్షలు, మెద క్ జిల్లాలో 17,26,509 మంది రైతులకు రూ.1450 కోట్ల 2 లక్షలు, సంగారెడ్డి జిల్లాలో 21,76, 988 రైతులకు రూ. 2535 కోట్ల 82 లక్షలు రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులను జమచేసింది. ఈ వానకాలానికి జిల్లాలో కొత్త గా అర్హులైన రైతుల జాబితాను తయారు చేసే పని లో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యా రు. గతంలో రైతుబంధు పడిన రైతులకు అదే ఖాతాల్లో పెట్టుబడిసాయం జమకానున్నది.
31లోగా దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగా భూములు కొన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా భూమికొని పట్టాదారు పుస్తకం, లేదా ఆఫీసు కాపీ వచ్చిన రైతులు ఈ నెల 31లోగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తును అందించాలి. తొలకరి జల్లులు పడగానే సాగుపనిలో రైతులు నిమగ్నమవుతారు. ఎరువులు, విత్తనాలు, దున్నకం తదితర వాటికి పెట్టుబడి సాయం అవసరం పడతాయి. రైతులకు ఎలాంటి చింతలేకుండా సకాలంలో రైతు బంధు అందివ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే ఎన్నో పథకాలను ప్రారంభించింది. రైతు బీమా పథకంతో రైతు కుటుంబాల్లో భరోసా నింపింది. సబ్సిడీపై యంత్రాలు, ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతాంగానికి మద్ధతు ధరను కల్పించింది. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే తిప్పలు తప్పడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సా గు సమయం వచ్చిందంటే చాలు పెట్టుబడి సాయం ఎట్లా అని దిగులు ఉండే ఇప్పుడు ఆ రందీ లేదు. గత ప్రభుత్వాలు ఇలా పెట్టుబడి సాయం ఇవ్వక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి సాగు చేసేవారు. తీరా పంట చేతికి వచ్చే సరికి వ్యా పారుల వడ్డీకే పంట సరిపోయేది. దీంతో రైతులు అప్పులపాలయ్యేవారు. ఇప్పుడు రైతులకు అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో సాఫీగా సాగుచేసుకుంటున్నారు.
జూన్ మొదటి వారంలో రైతు బంధు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు వచ్చేనెల రైతు బంధు తమ తమ ఖాతాల్లో పడనున్నది. గత యాసంగి మాదిరిగానే ఈ వానకాలం సాగుకు నేరుగా రైతుల ఖాతాల్లోనే రైతు బంధు డబ్బులు జమకానున్నాయి. జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు ఆఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మే 2018లో సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకుగానూ ఏడాదికి రూ.8 వేలు అందించారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ప్రస్తుత వానకాలం పంటతో వరుసగా తొమ్మిది పంటలకు రైతుబంధు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నది.
రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు
* కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ ఈనెల 31వ తేదీ వరకు చేసుకొని పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులందరూ కూడా అర్హులు.
* పట్టా పాస్బుక్ లేదా ఆఫీస్ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ (సేవింగ్ ఖాతా)
* దరఖాస్తు ఫారం నింపి జిరాక్స్ కాపీలను జతచేసి సంబంధిత వ్యవసాయశాఖ అధికారికి అందజేయాలి.
* రైతులు ఎవరైనా తమ భూమిలోని కొంత భాగాన్ని అమ్మినా లేదా కొన్నా ఇంతకు ముందు ఉన్న బుక్లోనే అప్డేట్ చేస్తారు.
* కనుక అలాంటి వారు ఎలాంటి జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
* రైతుబంధు డబ్బులు క్రాప్లోన్ అకౌంట్లో జమఅయితే రైతులు తమ సేవింగ్ అకౌంట్ ఖాతా నంబర్ను ఇవ్వొచ్చు.
* ఇంకా మిగిలిపోయిన రైతులు సకాలంలో సంబంధిత వ్యవసాయశాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.