మెదక్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 4న ఓటరు జాబితాను ప్రకటించారు. 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ వచ్చినా కొత్త ఓటరు నమోదుకు చివరిగా ఈ నెల 30వ తేదీ వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యంత్రాంగం సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు, మార్పులు చేర్పులకు అవకాశమిచ్చింది. ఆ దరఖాస్తులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ గడువులో కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు మాత్రమే అవకాశం కల్పించింది. ఫారం 7, 8 ద్వారా మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వలేదు. ఫారం-6తో ఆన్లైన్లోగానీ, నేరుగా బూత్ లెవల్ అధికారుల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ 4న విడుదలైన ఓటరు జాబితా పోలింగ్ కేంద్రాల వారీగా ఉండగా, ఇప్పుడు కొత్తగా నమోదయ్యే వారి లిస్టు సప్లిమెంటుగా ప్రచురిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఈనెల 31వ తేదీ వరకు ఆధార్కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం అందజేస్తే మరో నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో పాల్గొని ఓటు హకును వినియోగించుకునే సువర్ణావకాశాన్ని పొందుతారు.
జిల్లాలో ఓటర్ల నమోదుకు కేవలం 8 రోజులు గడువు మాత్రమే మిగిలింది. ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఎన్నికలు జరిగే ప్రతిసారి ఓటు శాతం పెంచడం కోసం సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హకు ఎంతో విలువైనదని, ఓటు వజ్రాయుధంతో సమానమని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విసృ్తతంగా ప్రచారం చేస్తుంటారు.
అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నందున ఎన్నికల కమిషన్ ఈ నెల 31వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని 18 ఏండ్లు నిండిన ప్రతిఒకరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఓటరు నమోదు, ఓటు హకు వినియోగం గురించి గ్రామాల్లో విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ సైతం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలను ఇందులో భాగస్వాములు చేశారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటును నమోదు చేశారు. ఇప్పటికే ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఈ నెల 9న అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓటు శాతం పెంపొందించేందుకు అధికారులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు గడువు ఇచ్చారు. అదీ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటరు తుది జాబితాను ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం మెదక్ జిల్లాలో మొత్తం 4,34,900 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,10,209 మంది, మహిళలు 2,24,680 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు. ప్రస్తుతం ఓటరు నమోదుకు గడువు పెంచడంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. మెదక్ నియోజకవర్గంలో 2,14,118 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,02,359 మంది, మహిళలు 1,11,755 మంది, ట్రాన్స్జెండర్లు నలుగురు ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,20,782 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,07,850 మంది, మహిళలు 1,12,925 మంది, ట్రాన్స్ జెండర్లు ఏడుగురు ఉన్నారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ ఓటు హకు ఉన్నదో లేదో జాబితా ద్వారా పరిశీలించుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేనివారు, కొత్త ఓటర్లు విధిగా పేర్లు నమోదు చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.