సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 30: సంగారెడ్డి జిల్లాలో 8 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్, సహకార, తదితర శాఖల అధికారులతో శనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై వీరారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ జిల్లాలో 18,668 ఎకరాల్లో శనగ పంట సాగైందన్నారు. సుమారు 13,067 మెట్రిక్ టన్నుల శనగ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని అంచనా వేశామన్నారు. ఆ మేరకు ఆయా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నాగల్గిద్ద, రాయికోడ్, జహీరాబాద్, గుమ్మడిదల సదాశివపేట, ఝరాసంఘం, ఏడాకులపల్లి, బొక్కస్గావ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
శనగలు క్వింటాలుకు రూ.5,335ల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్లు, డిజిటల్ కాంటాలు, అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారికి సూచించారు. ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేయాలని, గోడౌన్లను గుర్తించాలని మార్క్ఫెడ్ అధికారికి సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న శనగలను తమ వ్యవసాయ విస్తరణ అధికారితో ధ్రువీకరణ తీసుకురావాలని వివరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో మార్క్ఫెడ్ అధికారి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహరావు, జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్, మార్కెటింగ్ అధికారి మల్లికార్జున్, డీసీఎంఎస్ బిజినెస్ మెనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు.