ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలందుతున్నాయి. పేద ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూ. కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానంగా మాతా,శిశు మరణాలను తగ్గించడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం సర్కారు దవాఖానల్లోనే గర్భిణులు ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నది. డెలివరీ అయిన వెంటనే 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్, నాలుగు విడుతల్లో నగదు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. తల్లీబిడ్డలను 102 ప్రత్యేక వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నది. సర్కారు అమలుచేస్తున్న ఈ కార్యక్రమాలతో దవాఖానల్లో కాన్పుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో 19 పీహెచ్సీలు, ఒక జిల్లా కేంద్ర దవాఖాన, ఒక ఏరియా దవాఖాన, రెండు సీహెచ్సీల్లో నాలుగు నెలల వ్యవధిలో 628 ప్రసవాలు జరుగగా, 78.76 శాతంతో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచించి. మెదక్లోని పిల్లికోటాల్ వద్ద ఏర్పాటు చేసిన మాతా,శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతి నెలా 350కి పైగా డెలివరీలు జరుగుతుండగా, గత ఏడు నెలల్లో 2566 జరిగాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), ఆగస్టు 17
మెదక్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానల్లో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. ప్రసవాల సంఖ్య సైతం భారీగా పెరుగుతున్నది. మెదక్ జిల్లాలో 19 పీహెచ్సీలు, ఒక జిల్లా కేంద్ర దవాఖాన, ఒక ఏరియా దవాఖాన, రెండు సీహెచ్సీల్లో నాలుగు నెలల వ్యవధిలోనే 628 ప్రసవాలు జరుగగా, 78.76శాతం తో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచించి. అయితే, జూలై నెలలో 75.42 శాతం ప్రసవాలు జరిగాయి. మెరుగైన వైద్యం, ఉచితంగా మందులు అందజేస్తుండడంతో వైద్య కోసం సరారు దవాఖానలకు వచ్చే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సరారు దవాఖానకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. కానీ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దవాఖానల రూపురేఖలు మార్చి అన్ని సౌకర్యాలు కల్పించడంతో రోగులకు మెరుగైన వైద్యం అందుతోంది. 2017 జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. సర్కారు దవాఖానల్లో ప్రసవం జరిగితే 16 వస్తువులతో కేసీఆర్ కిట్తో పాటు అమ్మఒడి పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుండటంతో గర్భిణులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం మానేశారు. సరారు దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా మెరుగైన వైద్యం అందుతుండటంతో రోజురోజుకూ ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నదని జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారులు పేరొంటున్నారు.
మెదక్ మాతా, శిశు సంరక్షణ కేంద్రం గత ఏడాది జూన్ నుంచి అందుబాటులోకి వచ్చింది. అదే నెల నుంచి ప్రసవాలు చేయడం ప్రారంభించారు. ప్రతి నెలా 350లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయి. జనవరి 2023 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 2566 ప్రసవాలు జరిగాయి. ఇందులో 1306 నార్మల్ కాగా, 1260 సీ సెక్షన్లు అయ్యాయి. ప్రతి నెలా 350లకు పైగా కాన్పులు చేస్తున్నారు. ఇందులోభాగంగా 2023 జనవరిలో నార్మల్ 185 కాగా, 176 సీ సెక్షన్లు అయ్యాయి. ఫిబ్రవరిలో 181 సాధారణ, 149 సెక్షన్, మార్చిలో 190 నార్మల్, 151 సెక్షన్, ఏప్రిల్లో 182 నార్మల్, 185 సెక్షన్, మే నెలలో 182 నార్మల్, 191 సెక్షన్, జూన్లో 138 నార్మల్, 156 సెక్షన్, జూలై నెలలో 191 నార్మల్, 182 సెక్షన్, ఆగస్టు 10వ తేదీ వరకు 57 నార్మల్, 70 సెక్షన్లు అయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 2566 కాన్పులు జరిగాయి.
మెదక్ జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్లో ప్రతినెలా 350కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. కాన్పుల్లో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గత ఏడు నెలల వ్యవధిలో 2,566 ప్రసవాలు జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సర్కారు దవాఖానల రూపురేఖలు మార్చారు. ఒకప్పుడు ప్రైవేట్ దవాఖానకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసే ప్రజల కోసం సర్కారు దవాఖానల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో, గర్భిణులు సర్కారు దవాఖానలకు ప్రసవాల కోసం వస్తున్నారు. డెలివరీ అయిన వెంటనే బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేస్తున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా అమ్మఒడి వాహనంలో గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
– ఎం.పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
సర్కారు దవాఖానలకు మంచి రోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ కార్పొరేట్ను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో గర్భిణులు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు. అధునాతన హంగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రసవాల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో మెదక్ జిల్లా నిలవడం సంతోషంగా ఉంది. ఎంసీహెచ్లో 80 శాతం నార్మల్ డెలివరీలు అవుతున్నాయి. డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటూ గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
– డాక్టర్ చందునాయక్, డీఎంహెచ్వో
మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైద్యరంగాన్ని పటిష్ట పరుస్తోంది. ఇందులో భాగంగానే గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు, శిశువుకు టీకాలు పూర్తయ్యేవరకు వైద్య సిబ్బందిచే పర్యవేక్షణ చేయిస్తోంది. దీంతో జిల్లాలో ప్రసవాల సంఖ్య పెరిగి, మాతా, శిశు మరణాలు తగ్గాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి సేవలు అందించడంతో పాటు స్వస్థలం ఎంతదూరమైనా మాతాశిశువులిద్దరినీ 102 వాహనాల్లో పైసా ఖర్చు లేకుండా క్షేమంగా ఇంటికి చేరుస్తున్నది. మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటాల్ సమీపంలో రూ.17 కోట్లతో మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)ను 2022 మే 28వ తేదీన రాష్ర్ట ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. గర్భిణిగా పేరు నమోదైన నాటి నుంచి ఆరునెలల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స తీసుకుంటుండగా, ఆరు నెలల సమయం నుంచి ఎంసీహెచ్కు వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్లో కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలను ప్రకటించింది. మెదక్ జిల్లాలో 18,522 కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు డెలివరీల కోసం అధిక శాతం ప్రజలు ప్రైవేట్ దవాఖానలకే వెళ్లేవాళ్లు. ప్రభుత్వ దవాఖానలంటే నమ్మకం ఉండేది కాదు. కానీ, కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాల అమలుతో గర్భిణుల సరారు దవాఖానలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ను పంపిణీ చేయడంతో పాటు నాలుగు విడుతల్లో ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది. మొదటి విడుతలో భాగంగా ప్రభు త్వ దవాఖానలో గర్భిణిగా పేరు నమోదు చేసుకోవడంతోపాటు వైద్య పరీక్షలు, టీటీ ఇంజక్షన్, ఐరన్ మాత్రలు తీసుకుంటే రూ.3 వేలు, రెండో విడుతలో భాగంగా ప్రసవమైన వెంటనే రూ.4 వేలు, ఆడపిల్ల జన్మిస్తే రూ.5 వేలు సాయాన్ని అందిస్తున్నది.