సిద్దిపేట అర్బన్, జూన్ 14 : నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు వద్ద నిర్మించిన మోడ్రన్ స్లాటర్ హౌస్, కోటిలింగాల ఆలయం వద్ద సీసీ రోడ్ల శంకుస్థాపన, కప్పలగుంట చెరువు, గద్దబొమ్మ వద్ద ఏర్పాట్లను, స్వచ్ఛబడి ప్రాంతాన్ని, ఐటీ టవర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ముందుగా సిద్దిపేట పట్టణ శివారులోని ఇర్కోడు గ్రామం వద్ద రూ. 6 కోట్లతో నూతనంగా నిర్మించిన మోడ్రన్ స్లాటర్ హౌస్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలో రూ. 20 కోట్లతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు నర్సాపూర్ వద్ద ఉన్న కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా కొనసాగింపు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పట్టణంలోని స్వచ్ఛ బడిని సందర్శించనున్నట్లు తెలిపారు.
అనంతరం సిద్దిపేట పట్టణ శివారులోని నాగుల బండ వద్ద రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించి, పక్కనే సుమారు పది వేల మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో 750 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
మంత్రుల పర్యటన ఇలా..
నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రుల పర్యటన ఈ విధంగా కొనసాగుతుంది. ముందుగా ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఉదయం 10.30 గంటలకు పట్టణ శివారులోని ఇర్కోడు గ్రామం వద్ద నిర్మించి మోడ్రన్ స్లాటర్ హౌస్ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట పట్టణంలో బీటీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.15 గంటలకు నర్సాపూర్ వద్ద గల కప్పలకుంట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఉదయం 11.45 పట్టణంలో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వచ్ఛ బడిని సందర్శించి, మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నాగులబండ వద్ద నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు.