Telangana | సిద్దిపేట, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పాలనలో పచ్చిన పంటలతో అలరారిన ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఎటుచూసినా ఎండిన పంటలు, అడుగంటిన చెరువులు, కుంటలు, బావులు కనిపిస్తున్నాయి. అనధికార విద్యుత్ కోతలు, నీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.కండ్ల ముందే ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. దీంతో చాలామంది రైతులు బోర్లు వేస్తున్నారు. మరికొందరు రైతులు వ్యవసాయ బావుల్లో క్రేన్లా ద్వారా పూడికతీత పనులు మొదలు పెట్టారు. ఏడేనిమిది ఏండ్ల తర్వాత పంట చేలు ఎండి పోవడం చూస్తున్నామని, మళ్లీ పాత రోజులు వస్తున్నాయని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఐదారేండ్లుగా ఎండాకాలం రాకముందే కాళేశ్వర జలాలతో చెరువులు, కుంటలు, వాగులు నింపడంతో సాగునీటి లేకుండే అని సిద్దిపేట జిల్లా రైతులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నన్ని రోజులు యాసంగిలో గుంట ఎండిపోకుండా పంటలను కాపాడిందని గుర్తుచేసుకుంటున్నారు. ఈ యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 3,30,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 2,60,000 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 83,000 ఎకరాల్లో రైతులు వరి వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ పంట చేతికి అందే పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంట చేలల్లో పశువులను మేపుతున్నారు. అక్కన్నపేట, హుస్నాబాద్ మండలంలో చాలా గ్రామాల్లో రైతులు తమ పంట చేలు ఎండిపోవడంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంది.
సంగారెడ్డి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో అనధికారిక కరెంట్ కోతలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు భూగర్భజల మట్టాలు తగ్గుముఖం పడుతుండగా మరోవైపు కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.సంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో మొత్తం 1,67,120 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 82,320 ఎకరాల్లో వరి పంట, 54450 ఎకరాల్లో జొన్న, 18,394 ఎకరాల్లో శనగ, 3524 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 5180 ఎకరాల్లో మొక్కజొన్న, 1075 ఎకరాల్లో చెరుకు, ఇతర పంటలు సాగు చేశారు. యాసంగి సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు. జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, నల్లవాగు ప్రాజెక్టుల దిగువన, చెరువులు, కుంటల కింద 40వేల ఎకరాలు, బోరుబావుల కింద మరో 40వేల ఎకరాలకుపైగా రైతులు వరి సాగు చేశారు. నల్లవాగు ప్రాజెక్టు కాల్వల మరమ్మతు పనులు కొనసాగుతుండటంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడంలేదు. సింగూరు ప్రాజెక్టు కింద పుల్కల్, చౌటకూరు, అందోల్ మండలాల్లో రైతులు వరి సాగుచేశారు. జిల్లాలో భూగర్భజల మట్టాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా బోరుబావుల కింద వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాధారణ భూగర్భజలమట్టాలు గత ఏడాది డిసెంబర్లో 8.68 మీటర్లలోతులో ఉండగా ఈ సంవత్సరం జనవరిలో 9.71 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలో మొత్తంగా 1.03 మీట ర్లు భూగర్భజలాలు పడిపోయాయి. రోజూ సాయంత్రం 6.15 నుంచి రాత్రి 10 గంట ల వరకు అనధికారికంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.
రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరం మక్క, ఎకరం వరిపొలం సాగుచేశా. ఇరువై గుంటల మక్క, ఇరువై గుంటల వరిపొలం ఎండిపోయింది. ఏదీ సక్కగ పారుతలేదు. ఎన్నడూ కాలం గిట్ల కాలే. ఈ సంవత్సరమే ఇట్ల అయ్యింది. నిరుడు, ముందటేడు కాలం బాగైంది. బాయిల నీళ్లు గంటకంటే ఎక్కువ కూడా పారుతలేవు. పదిరోజుల నుంచి మొత్తానికే నీళ్లు ఎల్లుతలేవు.. వరి పొలంలో ఇక ఆవులను మేపుతున్నాం. ఇంకో పదిహేనురోజుల వరకు పంట చేతికి వస్తుండే. పదేండ్లనుంచి ఎవుసం చేస్తున్నా. చానా ఏండ్ల నుంచి కాలం మంచిగైంది. కానీ ఇప్పుడు వానలు సరిగ్గా పడలేదు. రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టా. మస్తు ఆశలు ఉండే కానీ మునుగుడైంది. ఎవుసం దెబ్బతిని అసలుకే మోసం అయ్యింది.
నాలుగు ఎకరాలపైన వ్యవసాయభూమి ఉంది. మూడు ఎకరాల్లో మక్క, ఎకరంన్నర వరి పొలం సాగుచేశా. పొలానికి నీళ్లు సరిపోవడం లేదు. కాలం సరిగ్గా కాలే. వానలు లేక బాయిలో నీళ్లు ఎల్లుతలేవు. రెండు మూడు గంటలు పోయగానే మోటర్ బంద్ అయితుంది. రెండులక్షల వరకు పెట్టుబడి పెట్టాం. ఏదో ఇంతచేసుకొని బతుకుదామనుకుంటే దేవుడు గిట్ల చేసిండు. పెట్టుబడి అంతా మునుగుడు అయితుంది. చుట్టాల దగ్గర అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగచేస్తే ఎకరంన్నరనే వరుస తడులమీద పారుతున్నది. రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టా. కర్రగాకపోతే తలపువ్వుకు వచ్చిన సేను పోయింది. ఏం లాభంలేదు. రైతు బంధు కూడా రాలేదు. గొర్రెపిల్లలను (జీవాలను) అమ్మితే రూ.80వేలదాకా వచ్చాయి. ఈ సంవత్సరం మొత్తం మునుగుడే. ఇద్దరం బతుకుడు కట్టమైంది. తొమ్మిదేండ్ల నుంచి కరువు చూడలే. కైకిలు సేత్తనిండుతదా… సోడు పండితే నిండుతది. మూలమడిపారితే కొన్నిరోజులు తింటాం.