మెదక్ న్యూస్నెట్వర్క్, జూలై27: రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపుతోనే జిల్లాలో వరద ముప్పు తప్పిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలందిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని పలు వరద ప్రాంతాలను ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం సందర్శించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి వర్షాల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్టేట్లోనే కంట్రోల్ రూం ఉండేదని ఏ సహాయ చర్యలు తీసుకోవాలన్నా అక్కడి నుంచి ఆదేశాలు రావాల్సి వచ్చేదని చెప్పారు. కానీ ఈ సారి వర్షంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తహసీల్దార్ స్థాయిలో ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇరిగేషన్, పంచాయత్రాజ్, ఆర్అండ్బీ, ఇంజినీరింగ్ విభాగాలు, విద్యుత్, వ్యవసాయ , ఉద్యానవన, అగ్నిమాపక శాఖలన్నింటనీ ఈ కంట్రోల్ రూంలతో అనుసంధానించినట్లు తెలిపారు. ముఖ్య శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటల విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పురాతన ఇండ్లల్లో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాల్లోకి తరలించారు.
జిల్లా కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ చందపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. ఓపెన్ ప్లాట్లలో నీరు నిల్వకుండా మట్టిని నింపించుకోవాలని యజమానులుకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్కు సూచించారు. భారీ వర్షాలతో బుధవారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ ఇంటికి గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలు మంజూరు చేయిస్తానన్నారు.
మెదక్ మండలంలోని స్కూల్ తండా రోడ్డులోని వాగు తెగిపోవడంతోపై ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామానికి చెందిన దుల్యా అనారోగ్యంతో మృతిచెందడంతో బాధిత కుటుంబనికి రూ. ఐదు వేల ఆర్థికసాయం అందజేశారు. హవేళీఘనపూర్ మండల కేంద్రంలో చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన నర్సింహులు అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొని నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి రూ. పదివేల ఆర్థికసాయం అందజేశారు.
పెద్దశంకరంపేట పట్టణంలోని తిరుమలాచెరువు, శంకరంపేట చౌదరి చెరువు, రామోజిపల్లి, బూర్గుపల్లి, లక్ష్మాపూర్ చెరువులతో పాటు మండలంలోని అన్ని కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దశంకరంపేటలో 32.3 మి.మీ., వర్షం కురిసినట్లు రెవెన్యూ అధకారులు తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు పూర్తిగా నిండి పొంగిపొర్లుతుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లోకి వరద వచ్చి చేరుతోంది. నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతోంది. నందిగామ సాయి చెరువు ఉదృతంగా అలుగు పారుతుండడంతో వరద నిజాంపేట మల్కచెరువుకు చేరుతోంది. మండల వ్యాప్తంగా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. డి.ధర్మారం పెద్దవాగు పొంగి పొర్లడంతో వాగు పెద్ద ఎత్తున నీటి ప్రవాహంతో ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు జలమయమయ్యాయి. వెల్దుర్తిలో 5.08, మాసాయిపేటలో 5.0 సెం.మీ., వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మాసాయిపేట మండలంలోని హల్దీప్రాజెక్టు ఉదృతంగా ప్రవహిస్తోంది. హల్దీవాగుపై ఉన్నచెక్డ్యాంలు భారీ నీటితో మత్తడు లు దూకుతున్నాయి. వెల్దుర్తి మండలంలో 34 ఇండ్లు, మాసాయిపేట మండలంలో 9 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
చేగుంట, నార్సింగి మండలంలో వారం రోజులుగా కురిస్తున్న భారీ వర్షానికి చెరువులు, కుంటల్లోకి భారీ వరద వచ్చి చేరడంతో అలుగులు పారుతున్నాయి. చేగుంటలో ఒక కుటుంబాన్ని,ఉల్లితిమ్మాయిపల్లిలో వర్షానికి ఇండ్లు కూలి పోవడంతో వారిని పునరావాస కేంద్రాలను తరలించి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చేగుంట చెరువు అలుగు పారడంతో ఎంపీటీసీ వెంకటలక్ష్మీరఘురాములు చెరువుకు పూజలు చేశారు.
పాపన్నపేట మండలంలోని వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో మంజీరా నది వనదుర్గా ప్రాజెక్టు నుంచి పొంగి పొర్లుతూ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ముందు నుంచి పరవళ్లు తొక్కుతోంది. దీంతో దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించి మూసివేసినట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. కొల్చారం మండలంలోని సంగాయిపేట పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయింది. తూము వద్ద గండి పడడంతో అధికారులు పూడ్చివేశారు. శివ్వంపేట మండలంలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారాయి.
కౌడిపల్లి మండలంలోని చెరువులు, కుంటలు అలుగులు పారి పొంగిపొర్లుతున్నాయి. చిన్నశంకరంపేటతో పాటు మండలంలో చెరువులు కుంటలు అలుగులు పాడుతున్నాయి. పంట పొలాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. చెరువుకుంటల్లోకి భారీగా నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.