సిద్దిపేట/దుబ్బాక/హుస్నాబాద్/చేర్యాల, ఏప్రిల్ 17: సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనుగోళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో చేపట్టడం లేదు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు కేవలం వందల్లో రైతుల వద్ద మాత్రమే కొనుగోలు చేశారు.
ఐకేపీ ద్వారా 210 కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 202 కేంద్రాలు, మెప్మా ద్వారా 6 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సిద్దిపేట మారెట్ యార్డులో ధాన్యం కొనడం లేదని ప్రతికల్లో కథనాలు రావడంతో అధికారులు ఇటీవల కొనుగోలు ప్రారంభించారు. అంతకుముందు వారంపాటు ధాన్యాన్ని తెచ్చిన రైతులు మారెట్లో పడిగాపులు పడ్డారు. మూడు రోజుల క్రితం వరకు జిల్లాలో కేవలం 167 మంది రైతుల నుంచి 876 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
దుబ్బాక నియోజకవర్గంలో 106 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో దుబ్బాక మున్సిపల్, దుబ్బాక మండలంలో 40 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి మండలంలో పీఏసీఎస్ 7, ఐకేపీ 14 కేంద్రాలను ప్రారంభించారు. దౌల్తాబాద్ మండలంలో 18, రాయపోల్ మండలంలో 15, తొగుట మండలంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించారు. దుబ్బాకలో మార్కెట్యార్డు, అప్పనపల్లి గ్రామంలో మినహా మిగిలిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు.
దుబ్బాకలో ఐకేపీ ఆధ్వర్యంలో 27, మెప్మా ఆధ్వర్యంలో 6, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 7 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక మార్కెట్ యార్డులో వారం కిందట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా..సోమవారం కొందరి రైతుల నుంచి 3 వేల బస్తాల ధాన్యం మాత్రమే కొన్నారు. అప్పనపల్లిలో కొనుగోలు చేపట్టినప్పటికీ , అక్కడ జాలి లేకపోవడంతో అదనంగా తూకం చేశా రు. మిగిలిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతులు మండుటెండల్లో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో సెంటర్లకు రైతులు తెచ్చిన వడ్లు రోజుల తరబడి నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. రెండు మండలాల్లో కలిపి పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27, ఐకేపీ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27 సెంటర్లకు కేవలం 5 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారు. అక్కన్నపేట మండలంలో కేవలం మైసమ్మవాగు తండా సెంటర్ మాత్రమే నడుస్తోంది. హుస్నాబాద్ మండలంలో హుస్నాబాద్ ఏఎంసీ, రాములపల్లి, మహ్మదాపూర్, నాగారం సెంటర్లలో కొనుగోళ్లు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలోని 13 సెంటర్లకు 3 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో మిగతా సెంటర్ల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. యాసంగి సీజన్ వరికోతలు మొదలై చాలా రోజులైంది. కొందరు రైతులు ఇప్పటికే రైస్మిల్లర్లకు విక్రయించారు. కొనుగోళ్లలో ఇంకా జాప్యం చేస్తే మిగతా రైతులు కూడా రైస్ మిల్లర్లకే ధాన్యాన్ని విక్రయించే పరిస్థితి ఉంటుంది.
దీంతో మద్దతు ధర దక్కక రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. హుస్నాబాద్ ఏఎంసీతోపాటు మరో నాలుగు సెంటర్లలో నాలుగు రోజుల క్రితం వరకు 115మంది రైతులకు చెందిన 5,700 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొన్నారు. అన్ని సెంటర్లకు ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, కాంటాలు పంపినప్పటికీ కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నా యి. డబ్బు లు కూడా బ్యాంకులో త్వరగా జమకావడం లేదని రైతులు తెలిపారు. క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఇవ్వకపోవడంతో రైతులు నారాజ్ అవుతున్నారు.
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా ఐకేపీ ఆధ్వర్యంలో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పది రోజుల క్రితం ప్రారంభించారు. కేంద్రాలు ప్రారంభించడంతో వడ్లు కొనుగోలు చేస్తారని రైతులు పొలాల నుంచి నేరుగా కేంద్రాలకు వడ్లను తెచ్చి రాశులుగా పోశారు. కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు వడ్ల కుప్పల వద్ద కాపాలా ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. వాతావరణంలో మార్పులు వస్తుం డడం, ఆకాశం మేఘావృత్తం అవుతుండడంతో వర్షం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతు న్నారు. త్వరగా కొనుగోళ్లు చేపట్టాని కోరుతున్నారు.
హబ్షీపూర్లో పదిరోజుల కిందట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మేము పండించిన వడ్లను కేంద్రానికి తీసుకొచ్చాం. ఇప్పటివరకు అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రోజూ కేంద్రానికి వచ్చి పడిగాపులు కాస్తున్నాం. ఇక్కడ రైతులకు ఎలాంటి వసతులు కల్పించ లేదు. గతంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించిన వెంటనే కొనేవారు. ఇప్పుడు పది రోజులు గడుస్తున్నా వడ్లను కొనడం లేదు.
-పద్మ, మహిళా రైతు, హబ్సీపూర్ (దుబ్బాక)