సర్కారు బడులు బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘మనఊరు – మనబడి’ కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నది. శిథిలావస్థకు చేరిన భవనాలు, అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఖర్చుచేసి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, ఆధునిక హంగులతో ముస్తాబుచేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లాలో 1262 బడులుండగా, మొదటి విడతలో భాగంగా 441 ఎంపిక చేశారు. వీటిల్లో 57 స్కూళ్లలో పనులన్నీ పూర్తయ్యాయి. మెదక్ జిల్లాలో 898 పాఠశాలల్లో 313 ఎంపిక చేశారు. ఇప్పటివరకు 33 బడుల్లో పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న (రేపు) వీటన్నింటినీ పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
– మెదక్/సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ), జనవరి 30
సంగారెడ్డి జనవరి 30(నమస్తే తెలంగాణ)/పటాన్చెరు, జనవరి 30ః ఒకప్పుడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ప్రాథమిక పాఠశాల పాడుబడిన కాంపౌండ్వాల్, రంగులు వెలసిన భవనాలతో శిథిలావస్థలో దర్శనమిచ్చేది. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా, ఆటపాటల కోసం విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఇప్పుడా స్కూల్ రూపురేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడిలోభాగంగా ప్రభుత్వం వివిధ పనుల కోసం రూ. 18 లక్షలు కేటాయించింది. తొలి విడతగా రూ. 1లక్ష 69 వేలు, రెండో విడతలో 4లక్షల 34వేలు వార్చుచేసి అధికారులు పనులు చేపట్టారు. ప్రస్తుతం రంగురంగుల చిత్రాలతో చక్కటి భవనాలు, కొత్త ఫర్నిచర్తో స్కూల్ కార్పొరేట్ స్థాయిలో కనిపిస్తున్నది.
ఆట సామాగ్రి అందించడంతో పాటు ఆడుకునే సౌకర్యం కల్పించడంతో చిన్నారుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నది. చేతులు కడుక్కునే వసతి, భోజనశాల, వంటశాలలు ఏర్పాటయ్యాయి. ఆర్వో ప్లాంట్ సైతం అందుబాటులోకి వచ్చింది. హైజెనిక్ టాయిలెట్స్ నిర్మించారు. స్కూల్ ప్రాంగణంలో వేసిన దేశనాయకుల చిత్రాలు వారి గొప్పదనాన్ని కళ్లకు కడుతున్నాయి. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో విద్యార్థులు బుద్ధిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇస్నాపూర్ పాఠశాల ఒక్కటే కాకుండా సంగారెడ్డి జిల్లాలోని 441 ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారనున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ఆధునీకరించిన 57 పాఠశాలలను ప్రారంభించనున్నారు.
441 పాఠశాలల ఎంపిక
జిల్లాలో మొత్తం 1262 పాఠశాలలుండగా, మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా తొలివిడతలో 441 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.162 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 363, పట్టణ ప్రాంతాల్లో 78 పాఠశాలలను అధికారులు ఆధునీకరిస్తున్నారు. 441 ప్రభుత్వ పాఠశాలల్లో 256 ప్రాథమిక, 61 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలల్లో వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలోని నీటిపారుదల శాఖకు 18, పబ్లిక్హెల్త్కు 8, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి 328, టీఎస్ఈడబ్ల్యూఐడీసీకి 87 పాఠశాలల నిర్మాణం బాధ్యతలను అప్పగించారు. 106 బడులను రూ.30 లక్షలపైన నిధులతో పనులు చేస్తుండగా, 331 స్కూళ్లను రూ.30 లక్షలలోపు నిధులతో ఆధునీకరిస్తున్నారు.
57 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధం
ఎంపిక చేసిన 441 పాఠశాలల్లో రూ.162 కోట్లతో 2429 పనులు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1862 పనులు పూర్తి కాగా 568 కొనసాగుతున్నాయి. 384 పాఠశాలల్లో ఆధునీకరణ పనులు తుదిదశకు వచ్చాయి. 57 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. వీటిని బుధవారం ప్రారంభించనున్నారు.