వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. వారికోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 281 బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో 281 బస్సులను హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు, మరో 47 బస్సులను ఆంధ్రాలోని పలు ముఖ్యమైన ప్రదేశాలకు నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 8 ఆర్టీసీ డిపోల నుంచి ఈ బస్సులు సేవలందిస్తాయి. శనివారం నుంచి 23వ తేదీ వరకు, 28నుంచి 31వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందజేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సంతోషంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ కృషిచేస్తున్నది. ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉద్యోగులు సంతోషంగా విధులు నిర్వహిస్తున్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 21: దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరా పండుగకు తమ సొంతూళ్లకు వెళ్తుం టారు. అలాంటి వారి కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి జిల్లా మెదక్ రీజియన్ నుంచి 281 బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో 281 బస్సులను హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు, అలాగే మిగతా 47 బస్సులను ఆంధ్రాలోని పలు ముఖ్యమైన ప్రదేశాలకు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 8 ఆర్టీసీ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఏటా ఆర్టీసీ అధికారులు మెదక్ రీజియన్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రా రాష్ర్టానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. 2020లో కరోనాతో ప్రపంచం అతలాకుతలం అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు ఇటీవల ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో వీలినం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషంగా విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో అత్యధికంగా దూర ప్రాంతాల ప్రజలు నివాసముంటున్నవారు, వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరాకు సొంతూళ్లకెళ్లి తిరిగి వారివారి గమ్యాస్థానాలకు చేరుకునే వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడిపిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు 28నుంచి 31వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు. బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులు తమ టికెట్ల వెనకాల ప్రయాణికుడి పేరు, ఫోన్ నంబర్ రాసి ఆయా బస్టాండ్లలో ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. అనంతరం ఆర్టీసీ యాజమాన్యం లక్కీ డ్రా తీసి రీజియన్ పరిధిలో విజేతలను ప్రకటించి బహుమతులు అందజేస్తారు. మెదక్ రీజియన్లోని 8 డిపోల నుంచి 281 బస్సులు నిరంతరంగా తిరుగుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు పకడ్బంది చర్యలు చేపట్టారు. అలాగే దూరప్రాంతాలకు సురక్షితంగా ప్రయాణించేందుకు సూపర్ లగ్జరీ, లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సంతోషంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నారు.
మెదక్ రీజియన్లోని 6 డిపోల నుంచి ఇప్పటికే ఆంధ్రా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, సందర్శన కేంద్రాలకు 47 బస్సులు నడిస్తున్నారు. సంగారెడ్డి డిపో నుంచి తిరుపతి, వైజాగ్, విజయవాడ, నెల్లూరుకు రోజువారీగా బస్సులు నడిపిస్తున్నారు. నారాయణఖేడ్ నుంచి కందుకూరు, చీరాలకు, జహీరాబాద్ నుంచి కాకినాడ, కందుకూరు, నెల్లూరు, బెంగళూరుకు బస్సులు నడుపుతున్నారు. మెదక్ నుంచి అమలాపురం, కాకినాడ, తిరుపతిలకు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నుంచి విజయవాడకు, సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళురు, విజయవాడ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యాలకు ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సులు నడిపిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు 281 బస్సులను పలు ప్రాంతాలకు కేటాయిస్తునట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అలాగే 47 దూరప్రాంతాలకు నడిచే బస్సులు మెదక్ డిపో నుంచి డీలక్స్-7, నారాయణఖేడ్ నుంచి సూపర్ లగ్జరీ-3, ఎక్స్ప్రెస్-5 బస్సులు, సంగారెడ్డి ఎక్స్ప్రెస్లు-7, జహీరాబాద్ నుంచి లగ్జరీ-8, ఎక్స్ప్రెస్-5, సిద్దిపేట డీలక్స్-8, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నుంచి ఎక్స్ప్రెస్-4 బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా బస్సులకు రూట్లను కేటాయించి నడుపుతామని అధికారులు స్పష్టం చేశారు.
దసరాకు మెదక్ రీజియన్ నుంచి ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యేకంగా దసరా పండుగకు బస్సులు నడుపుతూ ప్రయాణికులను క్షేమంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చుతాం. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈనెల 21 నుంచి 24 వరకు, 28నుంచి 31 వరకు ప్రయాణించిన వారికి బహుమతులు అందించేందుకు లక్కీడ్రాను నిర్వహిస్తున్నాం. ప్రయాణికులు దూరప్రాంతాలకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి బహుబతులను పొందాలి. ప్రైవేటు ప్రయాణం చేసి ప్రమాదం కొని తెచ్చుకోవడం కన్నా సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యం. క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ప్రయాణం చేసి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలని ఆర్టీసీ అకాంక్ష.