సంగారెడ్డి అర్బన్, మార్చి 27: గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినందునే జాతీయ అవార్డులు అందుకుంటున్నామని, సంగారెడ్డి జిల్లాలో 27 పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు సాధించడం సంతోషకరమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కులబ్గూర్ శివారులోని జీకేఆర్ ఫంక్షల్ హాల్లో దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ 2021-2022గా అవార్డులకు ఎంపికైన 27 మంది సర్పంచ్లకు మంత్రి హరీశ్రావు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు పంచాయతీల కార్యదర్శులు పలు విభాగాల సిబ్బందిని అభినందిస్తూ ప్రోత్సాహకాలను అందజేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలాగే, కొత్త బస్టాండ్లో డిపోకు కొత్తగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో గ్రామాల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించి అభివృద్ధి చేసి చూపించామన్నారు. సాగు, తాగునీటికి కొరత లేకుండా అన్నదాతలకు అండగా నిలబడడం, గ్రామగ్రామాన చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలు కేసీఆర్ పాలనను స్వాగతిస్తున్నారన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ నిధులు జడ్పీ, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు నేరుగా ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించారు. తెలంగాణ రైతుల గురించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాట్లాడే హక్కులేదని, మొసలి కన్నీరు కారిస్తే రైతులు కనికరించరని హితవు పలికారు. రాష్ర్టానికి వచ్చి పోయే కేంద్ర మంత్రులు రైతులకు ఏమిస్తారో చెప్పి రాష్ట్రంలో అడుగుపెట్టాలని చురకలంటించారు. ఉద్యమాలతో సాధించిన తెలంగాణను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో గాంధీగా మారుతారని స్పష్టంచేశారు.
సీఎం కృషితో పల్లెలు జిగేల్..
గతంలో పంచాయతీల్లో నీళ్లు కొరత, కరెంటు బోర్లు చెడిపోతే నిధులు మంజూరైనా సర్పంచ్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, అసలు నిధులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గడిచిన 70 సంవత్సరాల్లో ఏనాడూ పంచాయతీలు అవార్డులకు నోచుకోలేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో పల్లె, పట్టణప్రగతి అనే కార్యక్రమాలు ప్రారంభించారన్నారు.
దీంతో, గ్రామాల్లో అన్ని సమస్యలను పరిష్కరించి పచ్చదనం, పరిశుభ్రత, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, తడి,పొడి చెత్త, 24 గంటల కరెంట్, స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కేటాయించి గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి దేశం మొత్తం ఇటు వైపే చూస్తున్నదని, అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి నుంచి దేశస్థాయిలో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
వచ్చేనెల1 నుంచి స్థానిక సంస్థల ఖాతాల్లో నిధులు
ఏప్రిల్ 1 నుంచి జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు 14, 15 ఫైనాన్స్ నిధులు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అవసరమున్న పనులకు ఈ నిధులు ఖర్చు చేసుకోవచ్చన్నారు. అలాగే, వడగండ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపరిహారం రూ.10వేలు మంజూరు చేసి రైతులకు అండగా ఉంటున్నారన్నారు. ఈ విషయంపైనా బీజేపీ, కాంగ్రెస్లు నోరు పారేసుకుంటున్నాయని, నిజంగా ఆ పార్టీల నాయకులకు చిత్తశుద్ది ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభు త్వం నుంచి తెలంగాణ రైతులకు మరో రూ. పదివేలు నష్టపరిహారం ఇప్పించే విధంగా కృషి చేయాలన్నారు.
బీజేపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. పంటల దిగుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలపై ఎరువుల ధరలు పెంచి పెనుభారం మోపారన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంటు చార్జీలు పెంచడమే తప్ప రైతుల గురించి ఆలోచించే నాయకుడే లేడని చురకలంటించారు. తెలంగాణలో ఫసల్బీమా చేయాలని రైతులపై ఒత్తిడి చేస్తున్నారని, అదే గుజరాత్లో ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడంలేదో సమాధానం చెప్పాలన్నారు.
మరో గాంధీ సీఎం కేసీఆర్
– జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామని జిల్లా సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన తొమ్మిది విభాగాల్లో జిల్లాలోని 27 ఉత్తమ గ్రామపంచాయతీలుగా అవార్డులు సాధించడం గొప్పవిషయమన్నారు. సీఎం కేసీఆర్ మరో గాంధీగా పేరు తెచ్చుకుంటూ సంక్షేమం, అభివృద్ధి పథకాలు రెండు కళ్లుగా పాలన చేస్తుండడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు మొగ్గు చూపుతోందన్నారు.
అవార్డులు రావడంలో గ్రామసర్పంచ్, గ్రామస్తులు, అధికారుల శ్రమ ఎంతో ఉందని చైర్పర్సన్ అన్నారు. కార్యక్రమంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కలెక్టర్ శరత్కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్చైర్మన్ పట్నం మాణిక్యమ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.