ముంబై: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు సీనియర్ శిఖర్ ధవన్ సారథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంకకు పయనమైంది. ముంబైలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న 20 మంది సభ్యుల జట్టు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి ఆదివారం లంకకు బయల్దేరింది. జూలై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో లంకతో టీమ్ఇండియా మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి సిరీస్ ఇదే కానుండటంతో.. లంకలో సత్తాచాటి మెగాటోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలని యువ ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో సుదీర్ఘ టెస్టు సిరీస్ ఆడేందుకు కోహ్లీ నాయకత్వంలోని టీమ్ఇండియా ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. ధవన్ కెప్టెన్సీలో సెలెక్టర్లు ఈ జట్టును ఎంపిక చేశారు. జట్టు లంకకు బయల్దేరేముందు కోచ్, కెప్టెన్ వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
జట్టులో ఉన్నవాళ్లందరికీ అవకాశం వస్తుందని చెప్పలేం. యువ ఆటగాళ్లు సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకవేళ తుదిజట్టులో అవకాశం రాకున్నా యువ ఆటగాళ్లకు ఈ పర్యటన వల్ల మం చి లబ్ధి చేకూరుతుంది.
-రాహుల్ ద్రవిడ్, భారత కోచ్
యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. వాళ్లు సత్తాచాటుకునేందుకు ఇది సరైన అవకాశం. జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ద్రవిడ్ మార్గదర్శిగా ఉండ టం సంతోషకరం. – ధవన్, కెప్టెన్