జహీరాబాద్, జూలై 7: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న అదివాసీ, గిరిజన బిడ్డలకు ధైర్యాన్నిచ్చింది. ఏండ్లుగా గిరిజన బిడ్డలు గోసపడిన చోటే వారికి గౌరవాన్ని కల్పించారు సీఎం కేసీఆర్. గిరిజనులు సాగుచేసుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే గొప్పకార్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నది. తాత, ముత్తాతల నుంచి అటవీ భూములను సాగుచేసుకుంటున్న పేదలకు ఎలాంటి హక్కుపత్రాలు లేవు. దీంతో ఎప్పుడు ఏ అధికారి వచ్చి పండిన పంటను పాడుచేస్తారోనని ఆందోళన పడేశారు. బుక్కెడన్నం పెడుతున్న పోడుభూమికి హక్కుపత్రాలు లేక దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గిరిజనుల ఆందోళనకు శాశ్వత పరిష్కారం చూపుతూ సీఎం కేసీఆర్ పోడుపట్టాలను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు.
సమైక్యపాలనలో పోడు పట్టాలు లేక ఇబ్బందులు పడ్డ గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భయంగా పంటలు పండించన చోటే ఇప్పుడు దర్జాగా బతుకుతామంటూ సంబురపడుతున్నారు. తమకు పట్టాలు ఇవ్వనున్న బీఆర్ఎస్ ప్రభుత్వనికి, సీఎం కేసీఆర్కు ఎప్పుడూ రుణపడి ఉంటామని చెబుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు త్వరలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పట్టాలు పంపిణీ చేయనున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పోడుపట్టాల పంపిణీపై పలుమార్లు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. పోడు పట్టాల పంపిణీలో ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 1643మంది లబ్ధిదారుకలు 3586.52ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు పట్టాదారు పాసు పుస్తకాలు సిద్ధం చేశారు. పట్టా పొందిన ప్రతి రైతుకూ పంటల పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు.
నాడు రైతులపై కేసులు.. నేడు పోడుపట్టాలు
నాడు పోడుభూముల్లో పంటలు సాగుచేసే రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నేడు సీఎం కేసీఆర్ పోడుభూములకు పట్టాలు పంపిణీ చేసి, సాగు చేసుకునేందుకు రైతుబంధు డబ్బులు ఇస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై కేసులు నమోదు చేయించి, లాఠీదెబ్బలు కొట్టించారు నాటి సమైక్య పాలకులు. కాళ్లతో తన్నించి అడవిని నరికారంటూ కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పోడుభూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పోడుపట్టాలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పోడుభూములను పంపిణీ చేసేందుకు సబ్కమిటీ ఏర్పాటు చేసి మూడంచెల సర్వే నిర్వహించింది. ప్రభుత్వం సర్వే చేసి వాస్తవ స్థితిగతుల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించింది. జీవో 140తో లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు ఇవ్వనుంది.
పోడు పట్టాలు పంపిణీకి సర్వం సిద్ధం
జహీరాబాద్ నియోజకవర్గంలో ఎంపికచేసిన రైతులకు పోడుపట్టాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావుచే పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసి గిరిజనులకు పోడుభూముల హక్కు పత్రాలు అందజేస్తారు. పోడుపట్టాలు పంపిణీ చేసేందుకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, కలెక్టర్ శరత్తోపాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే అధికంగా పోడుపట్టాలు జహీరాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నారు. జహీరాబాద్ ఆర్డీవో వెంకట్రెడ్డి తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేసి పోడుపట్టాలపై పలు సూచనాలు చేశారు.
అర్హత ఉన్న గిరిజనులకు పోడుపట్టాలు
ప్రభుత్వం అర్హత ఉన్న రైతులను గుర్తించి పోడుపట్టాలు పంపిణీ చేస్తున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజనతండాలో అర్హత ఉన్న రైతులను గుర్తించి అధికారులు ఎంపిక చేశారు. పోడుపట్టాల పంపిణీని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావుచే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పోడు రైతుల బ్యాంకుఖాతాల వివరాలను, రైతు బంధు పోర్టల్లో ఆప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గతంలో పోడు పట్టాల కోసం గిరిజనులు ప్రభుత్వన్ని కోరినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నొ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
– కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
ఏండ్ల కల సీఎం కేసీఆర్ సారుతో నెరవేరింది..
ఎన్నో ఎండ్ల నుంచి పోడుభూమిని సాగు చేసుకుంటున్న గిరిజనులకు సీఎం కేసీఆర్ దేవుడిలావచ్చి హక్కులు కల్పించారు. పంట వేశాక అటవీశాఖ అధికారులు పంటను నాశనం చేసే వారు. ఎంతోమంది అధికారులకు మా బాధలు చెప్పకున్నా సమస్య పరిష్కారం కాలేదు. సీఎం కేసీఆర్ సారు పోడు
రైతులకు శాశ్వత పరిష్కారం చూపించారు.రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు ఎప్పటికీ గిరిజనులు మర్చిపోరు.
– ఖీరు, సజ్జారావుపేట తండా, మొగుడంపల్లి మండలం
దేవుడిలా ఆదుకున్న సీఎం కేసీఆర్
ఎంతోకాలంగా పోడుభూముల్లో పంటలు సాగుచేసినా పట్టాలు రావేమో అనుకున్నాం. ఎన్నో సార్లు అధికారుల నుంచి ఇబ్బందులు పడ్డాం. అటవీ అధికారులు గిరిజనులపై కేసులు నమోదు చేశారు. అడవికి వెళితే బెదిరించే వారు. భూమిని దక్కించుకునేందుకు చాలా కష్టాలు పడ్డాం. పోడుభూములకు పట్టాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది.
– వాసునాయక్, గోటిగార్పల్లి తండా , కోహీర్ మండలం